జగిత్యాల/కోరుట్ల, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామ సర్పంచ్ పదవి కోసం భార్యాభర్తతో పాటు కొడుకు సైతం నామినేషన్ వేశారు. కానీ ఓటు మాత్రం ఒక్కరికే వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. గ్రామానికి చెందిన పుల్ల సాయగౌడ్ గతంలో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయగా అది తిరస్కరణకు గురైంది. దీంతో ఈ సారి తాను నామినేషన్ వేయడంతో పాటు ముందుజాగ్రత్తగా భార్య పుష్పలత, కుమారుడు వెంకటేశ్తో నామినేషన్ వేయించాడు. ఈ గ్రామ సర్పంచ్ పదవి బీసీ జనరల్కు కేటాయించడంతో మొత్తం 12 మంది నామినేషన్లు వేశారు. వీడీసీ వేలంపై ఆరోపణలు రావడంతో ఆఫీసర్లు గ్రామంలో అవగాహన సమావేశం నిర్వహించడంతో పాటు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వకపోవడంతో సాయగౌడ్, పుష్పలత, వెంకటేశ్తో పాటు 12 మంది బరిలో ఉన్నారు. దీంతో సాయగౌడ్ కుటుంబ సభ్యులు సరికొత్త ఆలోచన చేశారు. ముగ్గురు వేర్వేరుగా కాకుండా.. కలిసి ప్రచారం చేస్తూ.. ఓటు మాత్రం సాయగౌడ్కే వేయాలని చెబుతున్నారు. పుష్పలత ఓటర్లకు బొట్టు పెడుతుండగా.. సాయగౌడ్ తన గుర్తు స్పానర్(పాన)ను, వెంకటేశ్ బ్యాలెట్ పేపర్ను చూపుతూ ప్రచారం చేస్తున్నారు. బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు కలిసి ఒక్కరి కోసం ప్రచారం చేస్తుండడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
