- అభ్యర్థుల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో), ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఈవో) పోస్టులకు ఈ ఏడాది జనవరిలో జరిగిన పరీక్షలను రద్దు చేయాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీక్లో ఏ2 నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి తల్లి ఈ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారని.. అందుకే ఆ ఎగ్జామ్స్ పేపర్స్ కూడా లీకై ఉండొచ్చని ఆరోపిస్తున్నారు.
ఈ పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులు టీజేఎస్ చీఫ్ కోదండరాం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళిని మంగళవారం వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందచేశారు. నిందితుడు రాజశేఖర్ రెడ్డి సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఈ మెరిట్ లిస్టులో టాప్ 9 ర్యాంక్ వచ్చిందని నాయకులకు వివరించారు. మెరిట్ లిస్ట్లో పేర్లున్న వారిపై విచారణ జరిపించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ పరీక్షలు రద్దు చేసే వరకు పోరాటాలు చేస్తామని, ఆమరణ దీక్షకు కూడా వెనుకాడబోమని రాష్ట్ర సర్కారును హెచ్చరించారు.
