- అభ్యర్థుల గెలుపోటములపై మొదలైన సర్వేలు
- ఫోన్, సోషల్ మీడియా ద్వారా ఓటర్ల నుంచి ఫీడ్బ్యాక్
- ప్రధాన పార్టీల అభ్యర్థులపై అభిప్రాయ సేకరణ
హైదరాబాద్, వెలుగు: ‘ఎన్నికల్లో మాదే అధికారం’ ఏ పార్టీ నోట విన్నా ఇదే మాట. వాళ్ల మాట సరే.. మరి జనం మాటేంటి? వాళ్లేం అనుకుంటున్నరు? ఎవరికి ఓటేస్తరు?.. ఈ విషయాలను తెలుసుకునేందుకు పలు సంస్థలు, పార్టీలు సర్వేలు ప్రారంభించాయి. అందులో భాగంగా నేరుగా ఓటర్లకు ఫోన్లు చేస్తున్నాయి. కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే అవతలి వైపు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.. అదే పద్ధతిలో ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు చేస్తూ జనాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. మీరు ఏ పార్టీకి ఓటేస్తరు.. ఎందుకు వేయాలనుకుంటున్నరు అంటూ ప్రశ్నలను సంధిస్తున్నారు.
ఆ అభ్యర్థికే ఎందుకు.. !
ఇప్పటిదాకా వివిధ పార్టీలు, నేతలు కొంతమంది ఉద్యోగులను నియమించుకుని వారు చేసిన అభివృద్ధి పనులను జనాల్లోకి తీసుకెళ్లారు. ప్రజలకు ఫోన్చేసి పార్టీకి సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఇప్పుడు కొన్ని సంస్థలు, పార్టీలు తమ పేరు చెప్పుకోకుండా గెలుపోటములపై సర్వే మొదలుపెట్టాయి. ‘‘రాబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు.? బీఆర్ఎస్ అయితే 1, బీజేపీ అయితే 2, కాంగ్రెస్ అయితే 3, ఇతర పార్టీలైతే 4 ప్రెస్ చేయండి’’ అంటూ ఫోన్ చేసి జనాన్ని అడుగుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థికే ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారనే అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. అభ్యర్థి ప్రజలకు దగ్గరగా ఉంటున్నారా? అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు కృషి చేస్తున్నారా? వంటి ప్రశ్నలను సంధిస్తున్నారు. అంతేగాకుండా ఇంతకు ముందున్న ఎమ్మెల్యేకు సంబంధించిన వివరాలనూ అడిగి తెలుసుకుంటున్నారు. ఆ వెంటనే సర్వేని క్లోజ్చేసి ఫోన్కాల్ కట్చేస్తున్నారు.
సోషల్ మీడియాలోనూ..
ఇటు సోషల్మీడియా, పలు షార్ట్న్యూస్ వెబ్సైట్లు కూడా అభ్యర్థుల గెలుపోటములపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. మీరు ఏ పార్టీకి ఓటేస్తారంటూ జస్ట్మూడు ముక్కల్లో సర్వే జరుపుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లలో ఏ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్న ఒక్క ప్రశ్నతో కూడా సర్వే చేపడుతున్నారు. మరోవైపు..రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇప్పటికే గ్రౌండ్లెవెల్లో సర్వే కోసం ప్రత్యేకంగా ఏజెన్సీలను నియమించుకున్నాయి. తమ అభ్యర్థుల గెలుపోటములకు ఉన్న అవకాశాలపై ఫోకస్ పెడుతున్నాయి. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేలా కసరత్తులు చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. అభ్యర్థులపై సీక్రెట్సర్వే జరుగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ కూడా సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని స్పష్టం చేసింది. నేషన్విత్ నమో సంస్థ బీజేపీ తరఫున సర్వేలు చేస్తున్నది