
- ప్రకటించిన అమిత్ షా
- జూన్ 1 నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) క్యాంటిన్స్లో జూన్ 1 నుంచి కేవలం మేడ్ ఇన్ ఇండియా గూడ్స్ మాత్రమే అమ్మాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు. స్వదేశీ ఉత్పత్తులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని ప్రధాని మోడీ ఇచ్చిన సందేశం మేరకు అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నారు. అమిత్ షా తీసుకున్న ఈ నిర్ణయం మేరకు దాదాపు 10 లక్షల కుటుంబాలు ఇక నుంచి స్వదేశీ వస్తువులే వాడనున్నారు. “ 2020 జూన్ 1 నుంచి ఏపీఎఫ్ క్యాంటిన్లలో మన దేశంలో తయారైన వస్తువులే అమ్మాలి. మోడీ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజలు స్వదేశీ ఉత్పత్తులను కొనడం వల్ల రానున్న ఐదేళ్లలో దేశం నిజంగానే ఆత్మ నిర్భర్ భారత్ అవుతుంది” అని అమిత్ షా ట్వీట్ చేశారు. అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎన్ఎస్జీ, ఎస్ఎస్బీ బలగాలన్నీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కిందకు వస్తాయి.