హైదరాబాద్ బడా బాబుల పిల్లలు కార్ల రేసింగ్తో రెచ్చిపోయారు. నగర శివారు నార్సింగిలో మితిమీరిన వేగంతో కార్ల రేసింగ్ నిర్వహించారు. అతి వేగంతో దూసుకెళ్తూ స్థానికులను భయాందోళనకు గురిచేశారు. కోకాపేట మూవీ టవర్స్లో బ్రాండెడ్ కార్లతో రేసింగ్ చేస్తూ స్థానికుల వెన్నులో వణుకు పుట్టించారు. గంటకు 120 నుంచి 140 కిలో మీటర్ల స్పీడ్ తో రయ్ రయ్ మని దూసుకెళ్తూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేశారు.
దీంతో స్థానికులు ‘డయల్ 100’ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు.. కార్లను సీజ్ చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ కార్లు మహారాష్ట్ర, పాండిచ్చేరి రాష్ట్రాల రిజిస్ట్రేషన్లతో ఉన్నాయి. కార్ల రేసింగ్కు పాల్పడిన సయ్యద్ మాజీద్ హుస్సేన్, రాకేష్, నారాయణ, ధనరాజ్, రమణ, మణికంఠ శర్మలపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారంతా బడా బాబులు పిల్లలు కావడంతో వారిని వదిలిపెట్టాలంటూ పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.