
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. దేవిశ్రీ ప్రసాద్ పై హిందు సంఘాలు, కరాటే కల్యాణిలు ఫిర్యాదు చేశారు. ‘ఓ పారి’ అనే ప్రేవేట్ ఆల్బమ్ లో ‘హరే రామ - హరే కృష్ణ’ మంత్రంపై అశ్లీల నృత్యాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దేవిశ్రీ ప్రసాద్ దెబ్బతీశారన్నారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ వెల్లడించారు.
టాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. రాక్ స్టార్ గా పేరొందిన దేవీ శ్రీ ఇటీవలే నాన్ ఫిల్మ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మ్యూజిక్ వీడియోను బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ లాంఛ్ చేశారు. ‘ఓ పరి’ టైటిల్ తో సాంగ్ సాగనుంది. దేవీ శ్రీ ప్రసాద్ స్వయంగా కంపోజ్ చేయడమే కాకుండా ఆయనే పాడారు. అయితే పాట మధ్యలో హరే రామ..హరే కృష్ణ ప్రస్తావన వచ్చింది. ప్రస్తుతం దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.