- మండల అధ్యక్షుడిపై కేసు నమోదు
గన్నేరువరం, వెలుగు: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను నిబంధనలకు విరుద్ధంగా ఎగురవేసి అవమానించారనే ఆరోపణలపై కరీంనగర్ జిల్లా గన్నేరువరం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిపై కేసు నమోదైంది. స్థానిక ఎస్సై నరేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. గన్నేరువరం గ్రామపంచాయతీ పరిధిలోని జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న బీఆర్ఎస్ గద్దెపై కాసింపేట గ్రామానికి చెందిన ఆ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న నేతలతో కలిసి గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు.
రాజకీయ పార్టీ గుర్తులు, రంగులు ఉన్న గద్దెపై జాతీయ జెండాను ఎగురవేశారని ఇది ‘ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా’, 2002 నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ గంప వెంకన్నపై గన్నేరువరం గ్రామ పంచాయతీ కార్యదర్శి జి.వెంకట్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాధ్యుడిపై కేసు నమోదు చేసి నట్లు ఎస్సై తెలిపాడు.
