- పిరమిడ్ స్కీమ్ నడిపాడని ఆరోపించిన డోజ్కాయిన్ ఇన్వెస్టర్
- మస్క్ ప్రమోట్ చేయడానికి ముందు డోజ్ వాల్యూ 30 పైసలే
- ఆయన ట్వీట్లతో రూ. 58 వరకు పెరిగిన ఈ మీమ్ కరెన్సీ
బిజినెస్ డెస్క్, వెలుగు: డోజ్కాయిన్ అంటే గుర్తొచ్చేది టెస్లా బాస్ ఎలన్ మస్కే. ఇందులో సందేహమే లేదు. 2020 డిసెంబర్ వరకు కేవలం 30 పైసలు దగ్గర ట్రేడయిన ఈ మీమ్ క్రిప్టో కరెన్సీ, ఎలన్ మస్క్ ప్రమోట్ చేశాక ఒకానొక దశలో రూ. 58 వరకు (73 సెంట్లు) పెరిగింది. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలు పతనమవుతుండంతో డోజ్కాయిన్ వాల్యూ రూ. 4 కి పడిపోయింది. దీంతో ఎలన్మస్క్పై ఓ డోజ్కాయిన్ ఇన్వెస్టర్ కోర్టులో కేసు వేశాడు. డోజ్కాయిన్ వలన నష్టపోయిన ఇన్వెస్టర్ల అందరి తరపున తాను కోర్టులో కేసు వేస్తున్నానని పేర్కొన్నాడు. డోజ్కాయిన్ వాల్యూ 80 బిలియన్ డాలర్లు తగ్గిందని, ఈ డబ్బులను నష్టపరిహారంగా ఇన్వెస్టర్లకు ఇప్పించాలని కోర్టులో దావా వేశాడు. ఇతర డ్యామేజ్ల కింద అదనంగా 178 బిలియన్ డాలర్లు (మొత్తం 258 బిలియన్ డాలర్లు) చెల్లించాలని కోర్టు ఫైలింగ్లో పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుతం మస్క్ సంపద 201 బిలియన్ డాలర్లకు పడిపోయింది. డోజ్కాయిన్తో పిరమిడ్ స్కీమ్ను మస్క్ నడిపాడని డోజ్కాయిన్ ఇన్వెస్టర్ కెయిత్ జాన్సన్ న్యూయార్క్ కోర్టులో కేసు ఫైల్ చేశాడు. కేవలం మస్క్పైనే కాకుండా టెస్లా, స్పేస్ఎక్స్లపై కూడా ఆయన కేసు వేశాడు. డోజ్కాయిన్ పేమెంట్లను అంగీకరిస్తామని ప్రకటించడంతో టెస్లాపై, ఒక రాకెట్కు డోజ్కాయిన్ పేరు పెట్టడంతో స్పేస్ఎక్స్పై జాన్సన్ కోర్టులో కేసు వేశారు. ఈ రెండు కంపెనీలకు ఎలన్ మస్క్ సీఈఓ కావడం గమనించాలి. ఇన్వెస్టర్లను మానిప్యులేట్ చేయడానికే మస్క్ ఈ మీమ్ కరెన్సీ వాల్యూని ఆర్టిఫిషియల్గా పెంచారని కెయిత్ జాన్సన్ ఆరోపిస్తున్నాడు. కాగా, డోజ్కాయిన్ను సాఫ్ట్వేర్ ఇంజినీర్లు బిల్లీ మార్కస్, జాక్సన్ పాల్మర్లు జోక్గా 2013 లో క్రియేట్ చేశారు. ఈ కాయిన్ను షిబా ఇను డాగ్ ఫోటోతో ప్రమోట్ చేశారు.
డోజ్కాయిన్పై మస్క్ ప్రేమ..
- మస్క్ డోజ్కాయిన్ను ప్రమోట్ చేయడం 2021, ఏప్రిల్ నుంచి స్టార్టయ్యింది. ‘చంద్రుడిని చూసి డోజ్ మొరుగుతోంది’ అని ఆయన మొదట ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఈ క్రిప్టో విలువ రూ. 34 కి పెరిగింది. కొన్ని రోజుల తర్వాత యూఎస్ కామెడీ షో ‘సాటర్డే నైట్ లైవ్’ లో డోజ్కాయిన్ గురించి మాట్లాడతాననే సంకేతాలను తన ఫాలోవర్లకు ఇచ్చారు. డోజ్కాయిన్పై హైప్ క్రియేట్ చేశారు.
- ‘డోజ్ఫాదర్’ అని మస్క్ ట్వీట్ చేయడంతో డోజ్కాయిన్ వాల్యూ మరో 20 శాతం మేర పెరిగింది. ఆయన తన బయోను కూడా ‘డోజ్కాయిన్ మాజీ సీఈఓ’ గా మార్చుకున్నారు.
- డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ (డెఫీ) కోసం ఎథీరియమ్ కంటే డోజ్కాయిన్ను వాడడం బెటర్ అని మస్క్ ప్రకటించారు. ట్రాన్సాక్షన్ల కోసం అయితే బిట్కాయిన్ కంటే డోజ్కాయిన్ను బెటర్ అని కూడా ట్వీట్ చేశారు.
- ఈ మీమ్ క్రిప్టో కరెన్సీని పేమెంట్గా టెస్లా అంగీకరిస్తుందని కిందటేడాది మస్క్ ప్రకటించారు. దీంతో ఈ క్రిప్టో కరెన్సీ 14 శాతం పెరిగింది. ఆ తర్వాత టెస్లా డోజ్కాయిన్లను ఇప్పట్లో అంగీకరించదని పేర్కొన్నారు.
- మెక్డొనాల్డ్స్ డోజ్కాయిన్ పేమెంట్లను అంగీకరిస్తే కంపెనీ అమ్మే ‘హ్యాపీ మీల్’ ను టీవీలో కనిపించేలా తింటానని ఒకసారి ట్వీట్ చేశారు కూడా.