కరూర్ తొక్కిసలాటపై స్టాలిన్ సర్కార్ సీరియస్.. విజయ్కి అత్యంత సన్నిహితుడు.. పార్టీలో నెంబర్2పై కేసు

కరూర్ తొక్కిసలాటపై స్టాలిన్ సర్కార్ సీరియస్.. విజయ్కి అత్యంత సన్నిహితుడు.. పార్టీలో నెంబర్2పై కేసు

చెన్నై: టీవీకే పార్టీ చీఫ్, నటుడు విజయ్ కరూర్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 39 మంది మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటనపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పోలీసుల నుంచి అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువ మంది జనాన్ని సమీకరించడంతో టీవీకే పార్టీ అగ్రనేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

మీటింగ్ నిర్వహణలో లోపాల కారణంగానే తొక్కిసలాట జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. ఈ మేరకు టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ, విజయ్ అత్యంత సన్నిహితుడు బుస్సీ ఆనంద్, జాయింట్ సెక్రటరీ నిర్మల్ కుమార్‌, కరూర్ జిల్లా టీవీకే పార్టీ కార్యదర్శిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి అరుణ జగదీశన్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‎కు విచారణ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఈ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సీఎం స్టాలిన్. 

కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం (సెప్టెంబర్ 27) రాత్రి కరూర్ జిల్లా కేంద్రంలో టీవీకే అధినేత విజయ్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‎కు జనం, విజయ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పోలీసుల నుంచి పర్మిషన్ 10 వేల మందికి తీసుకుంటే ఈ సమావేశానికి దాదాపు 50 వేల మంది హాజరైనట్లు సమాచారం. దీంతో జనం రద్దీ ఎక్కువై తొక్కి సలాట జరిగింది. ఈ ఘటనలో 39 మంది మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. 11 మందికి ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తు్న్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. 

తొక్కిసలాట ఘటనపై తమిళనాడు ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.