
సమర్థంగా ఎదుర్కోవాలని అనుబంధ సంఘాలకు రేవంత్ పిలుపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ లేకుండా చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని, దీన్ని సమర్థంగా ఎదుర్కోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ అనుబంధ సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. సోమవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన అనుబంధ సంఘాల మీటింగ్లో ఆయన మాట్లాడారు. సర్కారుపై పోరాటంలో అనుబంధ సంఘాల పాత్ర కీలకమని, అన్ని రకాల ఎత్తుగడలపై అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ప్రమాదంలో పడతామని రేవంత్ హెచ్చరించారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించి ప్రజల్ని చైతన్య పర్చాలన్నారు. పార్టీలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదని, అందరూ కలిసి బాధ్యతగా కార్యాచరణ రూపొందించి ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు.
కుల వృత్తులు నిర్వీర్యం
సీఎం కేసీఆర్ పాలనలో కులవృత్తులు నిర్వీర్యమయ్యాయని, ఏ కులం వాళ్లు కూడా ఆత్మగౌరవంతో బతకడం లేదని రేవంత్ ఆరోపించారు. మత్స్యకార సంఘాల చేప పిల్లలు పనికి రావని.. ఆ పనిని ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగిస్తోందని, నాసిరకం చేప పిల్లల్ని పంపిణీ చేసి కొందరు సర్కారు పెద్దలు మత్స్యకారులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా సోమవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. చేప పిల్లల పంపిణీలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతులకు అందించినట్లే మత్స్యకారులకు కూడా రూ.5 లక్షల బీమా పథకాన్ని అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మత్స్యకారులను బీసీ డీ నుంచి బీసీ ఏ గ్రూపులో చేర్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.