సూర్యాపేట, వెలుగు : ఏపీలోని గుంటూరు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున కారును, ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో సూర్యాపేట జిల్లాకు చెందిన ముగ్గురు చనిపోయారు. పొగమంచు కారణంగా రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు కనిపించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే... సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం మిడతనపల్లి గ్రామానికి చెందిన కంచనపల్లి వెంకటయ్య (70), సుశీల (64) దంపతులతో సహా మొత్తం ఎనిమిది మంది కుటుంబసభ్యులు కారులో ఇటీవల తిరుపతికి వెళ్లారు.
దర్శనం ముగించుకొని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా అంకిరెడ్డిగూడెం వద్దకు రాగానే టాయిలెట్ కోసమంటూ కారును రోడ్డు పక్కన నిలిపారు. ఇదే టైంలో గుంటూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు.. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటయ్య, అతడి భార్య సుశీలతో పాటు కారు డ్రైవర్ మద్దిరాల మండలం మామిళ్లమడగ గ్రామానికి చెందిన నవీల మహేశ్ (30) అక్కడికక్కడే చనిపోగా.. వెంకటయ్య కొడుకు మధుసూదన్, కోడలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. గాయపడిన వారిని గుంటూరు హాస్పిటల్కు తరలించారు.
