న్యూఢిల్లీ : 2024-–25 అసెస్మెంట్ సంవత్సరానికి పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి ఐటీ రిటర్న్ ఫామ్స్ 2, 3, 5 లను నోటిఫై చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం తెలిపింది. మొత్తం రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు దాఖలు చేయాల్సిన ఐటీఆర్–-1, కంపెనీల కోసం ఐటీఆర్–-6లను ఇది వరకే ప్రకటించారు. అన్ని ఐటీఆర్ ఫామ్స్ 1 నుంచి 6 వరకు నోటిఫై చేశారు. ఇవి ఏప్రిల్ 1, 2024 నుంచి అమలులోకి వస్తాయి. వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం లేని వ్యక్తులు హెచ్యూఎఫ్ లు ( ఐటీఆర్ ఫారం-1 (సహజ్) దాఖలు చేయడానికి అర్హత లేనివారు) ఐటీఆర్–-2ని ఫైల్ చేయవచ్చు.
వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం ఉన్నవారు ఐటీఆర్ ఫామ్-–3ని ఫైల్ చేయవచ్చు. నివాసితులు, హెచ్యూఎఫ్లు, సంస్థలకు (ఎల్ఎల్పీ కాకుండా) రూ. 50 లక్షల వరకు మొత్తం ఆదాయం వ్యాపారం, వృత్తి ద్వారా ఆదాయం కలిగి ఉంటే ఐటీఆర్--4 (సుగమ్) దాఖలు చేయాలి. భాగస్వామ్య సంస్థలు, ఎల్ఎల్పీలు ఐటీఆర్ ఫారం–-5ని ఫైల్ చేయవచ్చు. సెక్షన్ 11 కింద మినహాయింపును క్లెయిమ్ చేసేవి మినహా మిగతా అన్ని కంపెనీలు ఐటీఆర్ ఫారం–-6ని దాఖలు చేయాలని సీబీడీటీ తెలిపింది.