కవితకు 91 సీఆర్పీసీ నోటీసులు.. తాము చెప్పినచోట విచారణకు రావాలని సీబీఐ ఆదేశం

కవితకు 91 సీఆర్పీసీ నోటీసులు.. తాము చెప్పినచోట విచారణకు రావాలని సీబీఐ ఆదేశం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇవాళ దాదాపు 7 గంటలకుపైగా విచారించిన సీబీఐ అధికారులు వెళ్తూ ఆమెకు 91 సీఆర్పీసీ నోటీసులను ఇచ్చారు. తాము చెప్పిన చోట విచారణకు రావాలని ఆమెకు నిర్దేశించారు. త్వరలోనే విచారణకు సంబంధించిన తేదీలను తెలియజేస్తామని సీబీఐ అధికారులు చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఇవాళ విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు అడిగిన  డాక్యుమెంట్ లేదా డిజిటల్ డివైజ్ ను నిర్ణీత గడువులోగా కవిత సమర్పించాల్సి ఉంటుందని సమాచారం. 91 సీఆర్పీసీ నోటీస్ అందుకున్న వ్యక్తి తప్పనిసరిగా విచారణ అధికారి ముందు హాజరుకావాల్సి ఉంటుంది. తమ న్యాయ నిపుణులతో జరిగిన భేటీలో 91 సీఆర్పీసీ నోటీసులపైనే  కవిత చర్చించారని తెలుస్తోంది. 

ఇక ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు.. దాదాపు ఏడున్నర గంటల పాటు సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించారు. మహిళా అధికారులతో కూడిన ఆరుగురు సభ్యుల సీబీఐ టీం.. 160 సీఆర్పీసీ కింద కవిత స్టేట్ మెంట్ ను  రికార్డు చేశారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియా రికార్డింగ్ కూడా నిర్వహించినట్లు సమాచారం. ఉదయం నుంచి అడ్వొకేట్ సమక్షంలో అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం భోజన సమయం తర్వాత సీబీఐ అధికారులు అడ్వొకేట్ను బయటకు పంపి.. కవితను విడిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 

అమిత్ అరోరా  రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు ప్రస్తావించిన తర్వాత.. కవితకు సీబీఐ  నోటీసు ఇచ్చింది. నిందితులైన బోయినపల్లి  అభిషేక్ రావు, అరుణ్ రామచంద్ర  పిళ్లై, ఇండో స్పిరిట్ ఎండీ  సమీర్ మహేంద్రు స్టేట్మెంట్ ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.