మీ పిల్లలను సీబీఎస్ఈ సిలబస్లో చదివిస్తున్నారా..? ఈ విషయం తెలుసా మరి..!

మీ పిల్లలను సీబీఎస్ఈ సిలబస్లో చదివిస్తున్నారా..? ఈ విషయం తెలుసా మరి..!
  • సీబీఎస్ఈ పదో తరగతికి రెండు టర్మ్‌‌ల పరీక్షా విధానం
  • 2026 విద్యా సంవత్సరం నుంచి అమలు: సీబీఎస్ఈ

న్యూఢిల్లీ: విద్యార్థులపై అకడమిక్ ఒత్తిడిని తగ్గించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. 2026 విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండు సార్లు పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఆమోదం తెలిపింది. ఫస్ట్ మెయిన్ బోర్ట్ ఎగ్జామ్ ఫిబ్రవరిలో, రెండో ఎగ్జామ్ మే నెలలో నిర్వహించనున్నారు. సాధారణంగా సీబీఎస్ఈ టెన్త్, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఒకేసారి జరుగుతాయి. అయితే, వచ్చే విద్యా సంవత్సరం నుంచి10వ తరగతి పరీక్షలు.. 12వ తరగతి కంటే ముందుగానే ముగుస్తాయని బోర్డు తెలిపింది. మొదటి పరీక్షకు విద్యార్థులందరూ హాజరు కావాల్సి ఉంటుందని తెలిపింది. అందులో పాస్ అయిన వారు అదే విద్యా సంవత్సరంలోపు సైన్స్, మ్యాథ్స్, సోషల్ లేదా లాంగ్వేజెస్ ల్లోని ఏవైనా మూడు సబ్జెక్టుల్లోని మార్కులను మెరుగుపరుచుకునేందుకు రెండో పరీక్ష రాయడానికి అర్హులవుతారు.

మొదటి పరీక్షలో ఒకటి లేదా రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా కంపార్ట్‌‌‌‌మెంట్ కేటగిరీ కింద రెండో పరీక్షకు హాజరవుతారు. అయితే, మొదటి పరీక్షలో మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ లేదా మిస్ అయిన విద్యార్థులను ఎసెన్షియల్ రిపీట్‌‌‌‌(అకడమిక్ ఇయర్ పునరావృతం)గా గుర్తిస్తారు. వారిని రెండో పరీక్ష రాయడానికి అనుమతించరు. ఆ స్టూడెంట్లు తదుపరి ఏడాది ప్రధాన పరీక్షలకు మళ్లీ హాజరు కావాల్సి ఉంటుంది. మొదటి పరీక్ష ఫలితాల(ఏప్రిల్‌‌‌‌లో)తో 11వ తరగతిలో తాత్కాలిక ప్రవేశం పొందవచ్చు. ఫలితాలు డిజిలాకర్‌‌‌‌లో అందుబాటులో ఉంటాయి. రెండో పరీక్ష ఫలితాలు జూన్‌‌‌‌లో ప్రకటించి.. అధికారిక మార్క్‌‌‌‌షీట్, మెరిట్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. సిలబస్, ప్రశ్నల విధానం ప్రస్తుత విధానంలోనే ఉంటుందని బోర్డు పేర్కొంది.