ఎల్బీనగర్, వెలుగు: ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పోగొట్టుకుని.. అప్పు తీర్చేందుకు చైన్ స్నాచింగ్కు యత్నించిన యువకుడిని పోచంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావికి చెందిన చిడుగుల నరేశ్(30) ఆన్లైన్లో బెట్టింగ్పై రమ్మీ ఆడేవాడు. అందులో నష్టపోయి రూ.20 లక్షల వరకు అప్పు చేశాడు. ఆ అప్పును తీర్చేందుకు చైన్స్నాచింగ్ లకు స్కెచ్ వేశాడు.
యూట్యూబ్లో చైన్ స్నాచింగ్ వీడియోలు చూశాడు. ఈ నెల 7న మధ్యాహ్నం 2.30 గంటలకు నరేశ్ పోచంపల్లిలోని జిబ్లక్ పల్లికి బైక్పై వచ్చాడు. ఆ ఏరియాలో రోడ్లు ఊడుస్తున్న లక్ష్మమ్మ(65) అనే వృద్ధురాలి మెడలోని పుస్తెల తాడును లాక్కునే యత్నంలో గొలుసు తెగి కిందపడిపోయింది. లక్ష్మమ్మ గట్టిగా అరవడంతో నరేశ్అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నరేశ్ను గుర్తించి అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.