హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని సెల్లార్లను కేవలం వాహనాల పార్కింగ్ కోసమే వినియోగించాలని, అక్కడ నివాసాలు ఏర్పాటు చేయడం లేదా అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను నిల్వ చేయడం నిషిద్ధమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. శనివారం అగ్ని ప్రమాదానికి గురైన నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నీచర్ దుకాణాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు.
నిబంధనల ఉల్లంఘనలే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖలతో కలిసి హైడ్రా ఉమ్మడి తనిఖీలు నిర్వహిస్తుందని, ప్రతి దుకాణంలో స్ప్రింక్లర్లు వంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు కచ్చితంగా ఉండాలని ఆదేశించారు.
