హనుమకొండ, వెలుగు: జనగణనలో ఎన్యుమరేటర్లు ప్రతి కుటుంబం సమగ్ర, వాస్తవ పరిస్థితులను మాత్రమే నమోదు చేయాలని రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి సూచించారు. హనుమకొండ కలెక్టరేట్ లో సోమవారం హనుమకొండ, వరంగల్ జిల్లాలో చేపట్టిన జనగణన పురోగతిపై జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయ్, సత్య శారదతో కలిసి అడిషనల్ కలెక్టర్లు, డీఆర్వోలు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలతో రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా భారతి హోళికేరి మాట్లాడుతూ పదేండ్లకు ఉపయోగపడే జనగణన 50, 60 ఏళ్ల పాటు ప్రభావం చూపిస్తుందని, జూన్ 19లోగా జనగణన పూర్తి చేయాలన్నారు. ఏవైనా ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ జిల్లాలోని 14 మండలాల్లో జనగణన ప్రక్రియ వేగవంతంగా సాగుతుందన్నారు. వరంగల్ కలెక్టర్ సత్య శారద జిల్లాలో చేపట్టిన జనగణన ప్రక్రియ, ఎన్యుమరేటర్ల సంఖ్య, జనగణన పురోగతి వివరాలను వెల్లడించారు.
