పీఎఫ్ఐ బ్యాన్ పై సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు

పీఎఫ్ఐ బ్యాన్ పై సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు

పీఎఫ్ఐ సోషల్ మీడియా అకౌంట్‌లపై కేంద్రం ఫోకస్ చేసింది. ఇటీవలే ఐదేండ్ల పాటు పీఎఫ్ఐ బ్యాన్ చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్ లు వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పీఎఫ్ఐ బ్యాన్ పై సోషల్ మీడియా పోస్ట్ లను నిఘా వర్గాలు మానిటర్ చేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే పీఎఎఫ్ఐ స్టేట్ సోషల్ మీడియా ఖాతాలను కేంద్రం బ్లాక్ చేసింది. దాంతో పాటు కర్ణాటక, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర పీఎఫ్ఐ ట్విట్టర్ అకౌంట్స్ ను డిసబుల్ చేసింది. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పీఎఫ్ఐ బ్యాన్ తర్వాత సంబంధిత కార్యాలయాలను ఆ రాష్ట్ర అధికారులు సీజ్ చేస్తున్నారు. 

నిషేధిత PFI సంస్థపై  ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు చేపట్టగా... రీసెంట్ గా PFI ఛైర్మన్ ఒమా సలామ్ ట్విట్టర్ ను కేంద్రం నిలిపివేసింది. ఈ కేసులో ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు పీఎఫ్ఐ నేతలు అరెస్టులు అయ్యారు.. చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నలుగురు పీఎఫ్ఐ కార్యకర్తలను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది. అందులో రెహమాన్, వహీద్, జాఫరుల్లా, అబ్దుల్ వారిస్ లు ఉన్నారు. వీరిని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించిన అధికారులు.. నలుగురు నిందితులను ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత ఎన్ఐఏ అధికారులు30 రోజుల కస్టడీకి అనుమతించాలని కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 3 రోజుల కస్టడీకి అనుమతించిన ఎన్ఐఏ కోర్టు.. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను విశ్లేశించే పనిలో పడింది.

దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలతో సంచలనంగా మారిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్​ ఇండియా (పీఎఫ్ఐ), దానికి అనుబంధంగా ఉన్న 8 సంస్థలపై కేంద్రం ఇటీవలే నిషేధం విధించింది. టెర్రరిస్ట్ సంస్థలతో లింకులు ఉన్నాయని, దేశంలో ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం, ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టేందుకు కుట్రలు చేసినట్లు ఆధారాలు దొరకడంతో వీటిని నిషేధించినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద వీటిని ఐదేండ్ల పాటు బ్యాన్ చేస్తున్నామని, నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు తెలిపింది.