- అత్యధికంగా నువ్వులకు 452, కందికి 300 హైక్..
- అతితక్కువగా మొక్కజొన్నకు రూ.20 పెంపు
- ఎంఎస్పీకి కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం
- ఎంఎస్పీ ఉంది.. భవిష్యత్తులోనూ ఉంటది: కేంద్ర మంత్రి తోమర్
న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పప్పుధాన్యాలు, నూనెగింజలు, తృణధాన్యాలు తదితర ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచింది. వరికి గతేడాది మద్దతు ధర ఏ గ్రేడ్ రూ.1,888 ఉండగా ఈసారి 72 పెంచి రూ.1,960 చేసింది. సాధారణ వరి రకం ధర రూ.1,868 నుంచి రూ.72 పెంచి రూ.1,940 ఖరారు చేసింది. పొడుగు రకం పత్తికి రూ. 200, సాధారణ పత్తికి రూ.211 మద్దతు ధర పెంచారు. కంది క్వింటాల్కు రూ.300 పెంచారు. అధికంగా నువ్వులకు రూ.452, వేరుశనగకు రూ.275, పొద్దు తిరుగుడుకు రూ.130, సోయాకు రూ.70 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
‘రామగుండం’ ఫ్యాక్టరీకి ‘ఇన్వెస్ట్మెంట్ పాలసీ’
కొత్త పెట్టుబడి విధానాన్ని రామగుండం ఫర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)కి విస్తరించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ చేసిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఆర్ఎఫ్సీఎల్కు సబ్సిడీ ప్రయోజనాలు అందనున్నాయి.
బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఎంఎస్పీకి ఆమోదం తెలిపింది. మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వివరించారు. ‘‘ఎంఎస్పీ ఉంది. మద్దతు ధర పెరుగుతోంది. భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది” అని చెప్పారు. ఎంఎస్పీని రెగ్యులర్గా పెంచుతున్నామని, వాటి ప్రయోజనాలు రైతులకు అందుతున్నాయని అన్నారు.
ఉత్పత్తి వ్యయం కంటే 50 శాతం ఎక్కువ
పంట ఉత్పత్తికి అయ్యే ఖర్చును బట్టి కనీస మద్దతు ధరను నిర్ణయించారు. ఉత్పత్తి వ్యయం కంటే కనిష్టంగా 50 శాతం, గరిష్టంగా 85 శాతం మద్దతు ధరలను పెంచారు. అత్యధికంగా సజ్జలకు 85 శాతం, కంది 65 శాతం, మిగతా పంటలకు 50 శాతం పెంచి ఖరారు చేశారు. రాగులు, పెసలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయా, నల్ల, తెల్ల నువ్వులు, పత్తి పంటలకు ఉత్పత్తి వ్యయానికంటే 50 శాతం అధికంగా ధరలు కల్పించారు.
రైల్వేకి 5ఎంహెచ్జడ్ స్పెక్ట్రమ్
రైల్వేకి 700 ఎంహెచ్జడ్ బ్యాండ్లో 5 ఎంహెచ్జడ్ స్పెక్ట్రమ్ను కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమ్యూనికేషన్, సిగ్నలింగ్ సిస్టమ్స్ను ఇంప్రూవ్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. దాంతో ప్రయాణికులకు భద్రత కూడా పెరుగుతుందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. ‘‘2019 ముందు ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలకు కొత్త పెట్టుబడి విధానం కింద సబ్సిడీ ప్రయోజనాలు అందుతాయి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 2021లో ఏర్పాటు చేశారు. అందుకే పెట్టుబడి విధానాన్ని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి కూడా విస్తరించాం’’ అని ఆయన వెల్లడించారు.