
- గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు మంజూరు
- కేంద్ర కేబినెట్ భేటీలో ఆమోదం
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్పై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఈ రాష్ట్రానికి రోడ్డు, రైల్వే ప్రాజెక్టులను కేటాయించింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నిర్వహించిన కేంద్ర కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. భాగల్పూర్– దుమ్కా– -రాంపూర్హట్ రైలు మార్గం విస్తరణ పనులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
సింగిల్ లైన్ను డబుల్ చేసేందుకు రూ. 3,169 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఈ రైలుమార్గం బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ గుండా వెళ్తుంది. ప్రస్తుతం 177 కిలోమీటర్ల పొడవున సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ గా ఉన్న ఈ లైన్ డబ్లింగ్పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇది ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని, రవాణా సామర్థ్యాన్ని పెంచుతుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
మోకామా– ముంగేర్ 4 లేన్ రోడ్ ప్రాజెక్ట్..
బిహార్లో బక్సర్–భాగల్పూర్ హై స్పీడ్ కారిడార్లో 4 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 84 కిలో మీటర్ల జాతీయ రహదారికి రూ. 4,447 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. దీన్ని హ్యామ్విధానంలో నిర్మించనున్నారు. ఈ విభాగం భాగల్పూర్కు అనుసంధానించే మోకామా, బరాహియా, లఖిసరై, జమల్పూర్, ముంగేర్లాంటి ముఖ్యమైన ప్రాంతీయ నగరాల గుండా వెళ్తుందని, వాటికి కనెక్టివిటీని అందిస్తుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత కారిడార్ సమీపంలో ఆర్థిక కార్యకలాపాల పెరుగుదల వల్ల అదనపు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.