
10 జిల్లాల్లో సెక్యూరిటీ పెంపు
ఎక్కడచూసినా బారికేడ్లు.. అణువణువునా తనిఖీలు
ఎల్వోసీకి దగ్గర్లోని కేరాన్లో భారీగా ఆయుధాల పట్టివేత
నిత్యావసరాల కోసం భారీ క్యూలైన్లు
ఢిల్లీలోనూ ‘కాశ్మీర్’ హడావిడీ.. కీలక విభాగాల బాస్లతో అమిత్ షా మీటింగ్స్
నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయం?
రాజ్యసభ ముందుకు నేడు ‘జమ్మూకాశ్మీర్ రిజర్వేషన్’ బిల్లు
స్టేటస్ను కాపాడుకుంటామని కాశ్మీర్ పార్టీల తీర్మానం
టెర్రర్ అటాక్ జరగొచ్చన్న కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో కాశ్మీర్లోయలో వరుసగా మూడోరోజూ టెన్షన్ వాతావరణం కొనసాగింది. కేంద్రం పంపిన 30వేల అదనపు బలగాలు ఆదివారం ఉదయానికే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయి. శ్రీనగర్ సహా వ్యాలీలోని 10 జిల్లాల్లో సెక్యూరిటీ టైట్ చేశారు. సెన్సిటివ్ ఏరియాల్లో మరింత మంది సిబ్బందిని మోహరింపజేశారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోని మెయిన్ రోడ్లపై బ్యారికేడ్లు ఏర్పాటుచేసి, వెహికల్స్ను చెక్ చేస్తున్నారు. రోజురోజుకూ సెక్యూరిటీ మరింత పెరుగుతుండటంతో స్థానికుల్లో భయాందోళనలను రెట్టింపయ్యాయి. ఆయిల్, గ్యాస్ సహా ఇతర నిత్యావసరాల కోసం బంకులు, షాపుల వద్ద జనం క్యూ లైన్లలో నిలబడటం కనిపించింది. పర్మిషన్ లేకుండా పెట్రోల్, డీజిల్ అమ్మరాదంటూ వ్యాలీలోని డీలర్లను అధికారులు ఆదేశించారు. ఇంటర్నెట్ సేవల్ని తాత్కాలికంగా నిలిపేశారు. ఇక నాన్ లోకల్స్ని వెనక్కి పంపే పక్రియ దాదాపు పూర్తికావచ్చింది. శ్రీనగర్ నుంచి జమ్మూ చేరుకున్న నిట్ విద్యార్థుల్ని స్పెషల్ ట్రైన్లలో సొంత ప్రాంతాలకు పంపేశారు. ప్రత్యేక బస్సుల్లో అమర్నాథ్ యాత్రికులు, ఇతర టూరిస్టుల్ని వ్యాలీ నుంచి బయటికి తరలించారు. రిజర్వేషన్ లేకున్నా రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు. ఇదే అదనుగా శ్రీనగర్–ఢిల్లీ విమాన టికెట్ ధరను పెంచేసిన ప్రైవేటు విమానయాన సంస్థలకు.. క్యాప్విధించడం ద్వారా ప్రభుత్వం షాకిచ్చింది. ఇటు ఢిల్లీలోనూ కాశ్మీర్ అంశమే ప్రధానంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
చొరబడ్డ టెర్రరిస్టులు.. సమీప గ్రామాల్లో ఆయుధాలు..
బుధ, గురువారాల్లో ఎల్వోసీ వెంబడి పలు చోట్ల టెర్రరిస్టులు చొరబాటుకు యత్నించినట్లు ఆర్మీ ప్రకటించింది. ఈ క్రమంలో కుప్వారా జిల్లాలో ఎల్వోసీకి దగ్గరగా ఉన్న కేరాన్ సెక్టార్లో జరిగిన కాల్పుల్లో ఎడుగురు చొరబాటుదారులు హతమైనట్లు శనివారం అధికారులు వెల్లడించారు. చొరబాట్లను తిప్పికొట్టే ప్రయత్నం గట్టిగానే జరిగినప్పటికీ జైషే మొహ్మద్(జేఈఎం)కు చెందిన టెర్రరిస్టు టీమ్లు లోనికి చొచ్చుకొచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. అమర్నాథ్ యాత్రికులపై దాడులు చేయడమే లక్ష్యంగా టెర్రరిస్టులు ప్రవేశించారని తెలియడంతో ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం యాత్రను నిలిపేయడంతోపాటు నాన్లోకల్స్ అందరినీ కాశ్మీర్ వ్యాలీ నుంచి వెనక్కి పంపేస్తోంది. ఎల్వోసీకి దగ్గరగా కాల్పులు చోటుచేసుకున్న కేరాన్ ఏరియాలో ఆదివారం కేంద్ర బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు కలిసి నిర్వహించిన తనిఖీల్లో భారీ ఎత్తున ఆయుధాలు బయటపడటం టెన్షన్ను మరింత పెంచింది. కేరాన్ గ్రామంలోని ఓ టైలర్ షాపు నుంచి15 హ్యాండ్ గ్రేనేడ్లను స్వాధీనం చేసుకున్న సెక్యూరిటీ సిబ్బంది.. షాపు ఓనర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎల్వోసీకి సమీపంగా ఉన్న గ్రామాల్లో మరికొన్ని చోట్ల ఆయుధాల డంపులు బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దీంతో సెన్సిటివ్ ఏరియాల్లో ఎక్కువ మంది బలగాలను మోహరింపజేశారు.
ఆదివారం నాడూ అమిత్ షా రివ్యూలు
సెలవురోజైన ఆదివారం కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా వరుస మీటింగ్లతో బిబీబిజీగా గడిపారు. పార్లమెంట్ ఆవరణలోని తన ఆఫీసులో కీలక విభాగాల బాస్లతో మాట్లాడారు. చేశారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, ఇంటెలిజెన్స్ చీఫ్ అర్వింద్ కుమార్, రా చీఫ్ సమంత్ గోయల్, హోం శాఖ సెక్రటరీ రాజీవ్ గౌభాతో అమిత్ షా రెండుగంటలకుపైగా మాట్లాడారు. కాశ్మీర్ అంశమే ప్రధానంగా ఈ మీటింగ్ జరిగినట్లు సమాచారం. కాశ్మీర్ వ్యవహారాల్ని పర్యవేక్షించే హోం మినిస్ట్రీ అడిషనల్ సెక్రటరీతోనూ షా విడిగా సమావేశమయ్యారు. జమ్మూకాశ్మీర్లో అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో10 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. కాశ్మీర్పై కేంద్ర కేబినెట్ తీసుకోబోయే నిర్ణయాన్ని కూడా ఆయనే పార్లమెంట్కు వెల్లడించే అవకాశముంది.
కేంద్రానికి కాశ్మీరీ పార్టీల విజ్ఞప్తి
జమ్మూకాశ్మీర్లో టెన్షన్ నివారించాలంటూ అక్కడి ప్రాంతీయ పార్టీలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా ఇంట్లో ఆదివారం సాయత్రం కాశ్మీరీ పార్టీల జాయింట్ మీటింగ్ జరిగింది. దీనికి పీడీపీ చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సహా అన్ని పార్టీల లీడర్లు హాజరయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జమ్మూకాశ్మీర్ స్పెషల్ స్టేటస్ను వదులుకోబోమని, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి దక్కిన స్టేటస్ను కేంద్రం ఎత్తేస్తే చూస్తూ ఊరుకోబోమని మీటింగ్లో తీర్మానాలు చేశారు. టెన్షన్ పెంచొద్దని అటు పాక్ ప్రభుత్వాన్నీ కోరుతున్నట్లు నేతలు చెప్పారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే సెపరేటిస్టుల్ని జైళ్లలో పడేసిన కేంద్ర సర్కార్.. ఇప్పుడు రాజకీయ నేతలనూ టార్గెట్ చేసింది. ఎన్సీ నేత ఫరూఖ్ అబ్దుల్లాకు ఈడీ ఉచ్చుబిగించిన రెండ్రోజులకే పీడీపీ చీఫ్ ముఫ్తీకి ఏసీబీ నోటీసులు జారీ అయ్యాయి. బ్యాంకు ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలకు సంబంధించి ఏసీబీ ఆదివారం ఆమెకు నోటీసులు పంపింది.
నేటితో టెన్షన్కు తెర?
నాలుగు రోజులుగా కాశ్మీర్ లోయలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అంతటా ఉత్కంఠ నెలకొంది. మోడీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకోబోతోందనే చర్చ తారాస్థాయికి చేరింది. టెన్షన్ను నివారించేలా కేంద్రం ఏదో ఒక ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న కేబినెట్ భేటీ కీలకంగా మారింది. సాధారణంగా ప్రతి బుధవారం కేంద్ర సెక్రటేరియట్ సౌత్ బ్లాక్లోనే ప్రధాని మోడీ కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తారు. అలాంటిది ఈసారి మాత్రం మీటింగ్ను సోమవారానికి ప్రీపోన్ చేయడంతోపాటు వేదికను ప్రధాని అధికార నివాసమైన 7, లోక్కల్యాణ్ మార్గ్కు మార్చారు. ఈ మీటింగ్లో కాశ్మీర్ అంశమే ప్రధాన అజెండాగా ఉండొచ్చని, కేబినెట్ తీసుకోబోయే నిర్ణయాల్ని ఇదే రోజు పార్లమెంట్లోనూ ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. జమ్మూకాశ్మీర్కు స్పెషల్ స్టేటస్ కల్పించే 370 ఆర్టికల్, నాన్లోకల్స్కు ఇబ్బందిగా మారిన 35ఏ ఆర్టికల్ను ఎత్తేస్తారనే ఊహాగానాలతోపాటు పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్నూ స్వాధీనం చేసుకునే దిశగా నిర్ణయాలు వెలువడొచ్చని స్వత్రా చర్చ జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన జమ్మూకాశ్మీర్ గవర్నర్ మాత్రం వీటిని కొట్టిపారేశారు. ‘‘ఏం చేసినా అందరికీ చెప్పే చేస్తాం. సోమ, మంగళవారాల్లో దీనిపై ఓ క్లారిటీ వస్తుంది’’అని గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెప్పారు. ఆగస్టు 15న శ్రీనగర్లోని లాల్ చౌక్లో ప్రధాని మోడీ జెండా ఎగరేస్తారని, అందుకోసమే సెక్యూరిటీని పెంచారన్న వాదననూ కేంద్రం నిరాకరించింది. కాగా, ఇండిపెండెన్స్ డే నాడు కాశ్మీర్ లోయలోని అన్ని ప్రాంతాల్లో జాతీయ జెండా ఎగరేసేందుకే సెక్యూరిటీ పెంపు తదితర తతంగం జరుగుతున్నట్లు ‘ది ప్రింట్’ ఓ కథనాన్ని ప్రచురించింది.
అప్రమత్తమైన పాక్.. ఇమ్రాన్ ఆరోపణలు
కాశ్మీర్లోయలో వేగంగా మారుతోన్న పరిణామాలకు పాక్లో వణుకు మొదలైంది. ఎల్వోసీ వద్ద పాక్ చొరబాటుదారుల కాల్చివేతలు, శవాల్ని తీసుకెళ్లండంటూ ఇండియా చేసిన ప్రకటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమాలోచనలు చేశారు. అదివారం హుటాహుటిన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ను నిర్వహించిన ఆయన, ఆ తర్వాత ఇండియాపై ఆరోపణలు గుప్పిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఎల్వోసీ వద్ద అమాయకులపై ఇండియా బలగాలు దాడులు చేస్తున్నాయని, ఒప్పందాలకు విరుద్ధంగా నిషేధిత క్లస్టర్ వెపన్స్ను వాడుతోందని విమర్శించారు. దీనిపై యునైటెడ్ నేషన్స్ సెక్యురిటీ కౌన్సిల్(యూఎన్ఎస్సీ) వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన మీడియేషన్ ప్రతిపాదననూ ఇమ్రాన్ గుర్తుచేశారు. ‘‘కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడంలో మీడియేషన్ చేయడానికి డొనాల్డ్
ట్రంప్ ముందుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా దూకుడుగా వ్యవహరిస్తూ సరిహద్దు వద్ద టెన్షన్ పెంచుతోంది. పరిస్థితులు మరింత దిగజారితే ప్రాంతీయ సంక్షోభం తలెత్తుతుంది”అని ఇమ్రాన్ కామెంట్ చేశారు. పాక్ పీఎం కామెంట్లపై కేంద్రం ఇంకా స్పందించాల్సిఉంది.