
కరోనా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం
రూ. లక్షా డెబ్బై వేల కోట్లతో ప్యాకేజీ
కరోనా వల్ల దేశంలో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. అన్ని రంగాలు ఆర్థికంగా నష్టపోయాయి. పేద, మధ్య తరగతి వారు, రోజువారీ కూలీలు పూటగడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారందరినీ ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కరోనా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.
పేదలందరినీ ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో కేంద్రం గరీబ్ కల్యాణ్ పేరుతో రూ. లక్ష డెబ్బైవేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. కరోనా నివారణకోసం పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఆశావర్కర్లందరికీ మూడు నెలలపాటు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వారికి మూడు నెలల పాటు రూ. 50 లక్షల ఇన్యూరెన్స్ అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు. దీని ద్వారా దాదాపు 20 లక్షల వైద్య బృందాలు లబ్ధిపొందుతాయని ఆమె తెలిపారు.
పేదలు ఆహారం కోసం ఇబ్బంది పడకూడదని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ‘80 కోట్ల మంది పేదలకు నెలకు 5 కేజీల బియ్యం లేదా గోధుమలు వచ్చే మూడు నెలలపాటు ఉచితంగా ఇస్తాం. అదే విధంగా కిలో పప్పు కూడా ప్రతినెలా అందిస్తాం. రైతులకు వెంటనే రూ. 2000 ఆర్థికసాయం చేస్తాం. ఉపాధి హామీ కార్మికులకు రోజు కూలీ రూ. 180 నుంచి రూ. 202కు పెంచుతున్నాం. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నెలకు రూ. 1000 ఆర్థికసాయం చేస్తాం. మహిళా జనధన్ ఖాతాలకు నెలకు రూ. 500 చొప్పున మూడు నెలలు ట్రాన్స్ఫర్ చేస్తాం. ఉజ్వల లబ్ధిదారులకు నెలకు ఒకటి చొప్పున మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచుతున్నాం. రూ. 15 వేలలోపు జీతం తీసుకునే ఉద్యోగులకు మూడు నెలలపాటు పీఎఫ్ కేంద్రమే భరిస్తుంది. అంతేకాకుండా 75 శాతం పీఎఫ్ విత్ డ్రా కూడా చేసుకోవచ్చు’ అని ఆమె తెలిపారు.
For More News..