
కరోనా సోకిన పేషంట్లు తీసుకోవాల్సిన ఆహారంపై కేంద్రం పలు సూచనలు చేసింది. తగిన స్థాయిలో విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అందడానికి ఐదు రకాలు పండ్లు, కూరగాయలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలని చెప్పింది. కరోనా ఆందోళనను అదుపులో ఉంచుకోవడానికి 70 శాతం కొకొవా ఉన్న డార్క్ చాక్లెట్లు కొద్ది మొత్తంలో తీసుకోవాలని తెలిపింది. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రతి రోజూ ఒకసారి పసుపు పాలు తాగాలని సూచించింది. ప్రతిరోజూ తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలని చెప్పింది. ఆహారంలో ఆమ్చూర్ (మామిడి పొడి) ఉండేలా చూసుకోవాలి. రాగి, ఓట్స్ లాంటి తృణధాన్యాలు, ప్రొటీన్ ఎక్కువగా అందించే చికెన్, ఫిష్, గుడ్లు, పనీర్, సోయా, కాయగింజలు, బాదాం, వాల్నట్స్, ఆలివ్ ఆయిల్ తినాలి. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్వేవ్ విజృంభిస్తున్న ఈ సమయంలో హాస్పిటల్కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి కోలుకునే వారి సంఖ్యను పెంచడానికి మెరుగైన ఆహారమే మార్గమని ప్రభుత్వం అభిప్రాయపడింది. సరైన ఆహారం తీసుకుంటే 80 నుంచి 85 శాతం పేషెంట్లు ఇంట్లోనే కోలుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.