న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమ్మే పెట్రోల్లో గరిష్టంగా 20శాతం ఇథనాల్ కలపాలని, రీసెర్చ్ ఆక్టేన్ నెంబర్ (ఆర్ఓఎన్) కనీసం 95 ఉండాలని ఆదేశించింది. ఇథనాల్ చెరకు, మొక్కజొన్న, ధాన్యాల నుంచి తయారవుతుంది. ఇది రెన్యూవబుల్ ఎనర్జీ. ఈ నిర్ణయంతో క్రూడాయిల్ దిగుమతులు దిగొస్తాయని, కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయని, రైతుల ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఫిబ్రవరి 17న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లో 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో చమురు కంపెనీలు 20 శాతం వరకు ఇథనాల్-బ్లెండెడ్ మోటార్ స్పిరిట్(పెట్రోల్)ను విక్రయించాలి. మినిమం రిసెర్చ్ ఆక్టేన్ నెంబర్ (RON) 95 కలిగిన పెట్రోల్ ఉండాలి.' అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేక పరిస్థితులలో నిర్దిష్ట ప్రాంతాలకు, అంతేకాకుండా పరిమిత సమయం వరకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపులను అనుమతించేందుకు అవకాశం ఉంది.
