10 వేల ఎలక్ట్రిక్ బస్సులు 

10 వేల ఎలక్ట్రిక్ బస్సులు 

న్యూఢిల్లీ: దేశంలో మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 2024–25 మధ్యంతర బడ్జెట్​లో రూ.24,931 కోట్లు కేటాయించింది. అలాగే ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం రూ.1,300 కోట్లు అలాట్​ చేసింది. అర్బన్ పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్ అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. మధ్యతరగతి వేగంగా విస్తరిస్తోందని, అర్బనైజేషన్ ఫాస్ట్​గా పెరుగుతోందని.. దేశంలోని వివిధ మెట్రో లలో ప్రతి రోజు కోటి మంది ప్రయాణిస్తున్నారని ఆమె చెప్పారు.

పెరుగుతున్న అర్బనైజేషన్​కు మెట్రో లు, నమో భారత్ రైళ్లు ఉత్ప్రేరకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, మెట్రో ప్రాజెక్టులకు గత బడ్జెట్​లో రూ.23,175  కేటాయించగా ప్రస్తుతం 7.57 శాతం నిధులు పెంచినట్లు చెప్పారు. బడ్జెట్​లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కోసం రూ. 26,170 కోట్లు కేటాయించారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్‌‌‌‌కు రూ.5,000 కోట్లు కేటాయించారు. పీఎం-ఈబస్ సేవా పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు రూ.1,300 కోట్లు కేటాయించారు.

ఈ స్కీమ్ కింద ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో 169 సిటీలకు 10 వేల ఎలక్ట్రిక్ బస్సులు అందివ్వనున్నారు. 2037 వరకు కొనసాగే ఈ స్కీమ్​కు మొత్తం రూ.57,613 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం గతంలో తెలిపింది. ఇందులో రూ.20 వేల కోట్లు కేంద్రం, మిగతా మొత్తాన్ని రాష్ట్రాలు భరిస్తాయి.