- రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ శశాంక్ గోయల్
హైదరాబాద్, వెలుగు: లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా దళితబంధు స్కీమ్ అమలు చేసుకోవచ్చని సీఈవో శశాంక్ గోయల్ తెలిపారు. బుధవారం బుద్ధభవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ మినహా తొమ్మిది పాత జిల్లాల పరిధిలోని 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. దళితబంధు ఆన్గోయింగ్ స్కీమేనని, హుజూరాబాద్ ఉప ఎన్నికల వరకు మాత్రమే దానిని నిలిపేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశిలిచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆ పథకం అమలుపై ఏమైనా ఫిర్యాదు వస్తే సీఈసీ ఇచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలుంటాయన్నారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను తప్పకుండా అమలు చేయాలన్నారు. కలెక్టర్లు ఆయా జిల్లాల్లో జరిగే రాజకీయ సభలు, సమావేశాలు, ఆందోళనలపై దృష్టి సారించాలన్నారు. కలెక్టర్లు అనుమతి ఇస్తే తప్ప రాజకీయ కార్యక్రమాలు చేపట్టడానికి వీల్లేదన్నారు. ఈనెల 12న టీఆర్ఎస్ నిర్వహించే రైతు ధర్నాకు అనుమతి తప్పనిసరి అని క్లారిటీ ఇచ్చారు.