ఎంటర్ ది చైన్ స్నాచర్లు.. ఒంటరిగా వెళ్తున్నారా జాగ్రత్త..

ఎంటర్ ది  చైన్ స్నాచర్లు.. ఒంటరిగా  వెళ్తున్నారా  జాగ్రత్త..

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. ఒంటరిగా కనిపించిన మహిళలే టార్గెట్ గా రోజు రోజుకు భరితెగిస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా బంగారు గొలుసు కనిపిస్తే చాలు ప్రతాపం చూపిస్తున్నారు. తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ మండలం యమ్నం పేట బస్టాండ్ వద్ద చైన్ స్నాచర్లు బంగారు గొలుసు లాక్కెళ్లారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివారెడ్డి గూడ చౌరస్తాలో మంజుల (52) అనే ఉపాధ్యాయురాలు  బస్సు కోసం ఎదురు చూస్తోంది. ఈ సమయంలో అక్కడికి వచ్చిన చైన్ స్నాచర్లు..ఒంటరిగా ఉన్న మంజులను టార్గెట్ చేశారు. ఆమె  కంట్లో కారం కొట్టి మెడలోని  మూడు తులాల పుస్తెలతాడును లాక్కెళ్లారు. ఆ వెెంటనే పక్కనే ఉన్న చెట్ల పొదల్లో నుంచి పారిపోయారు. 

చైన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు.