పాలమూరులో..పాత కాపుల మధ్యే పోటీ

పాలమూరులో..పాత కాపుల మధ్యే పోటీ
  •     మహబూబ్​నగర్​ పార్లమెంట్ బరిలో చల్లా వంశీచంద్ రెడ్డి, డీకే అరుణ, మన్నె శ్రీనివాస్​ రెడ్డి
  •     పార్లమెంట్​ పరిధిలో కాంగ్రెస్​, బీజేపీలకు పెరిగిన ఓటింగ్​ పర్సంటేజీ
  •     ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్​ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం

మహబూబ్​నగర్, వెలుగు : మహబూబ్​నగర్​ లోక్​సభ స్థానం నుంచి మళ్లీ పాత కాపులే పోటీకి రెడీ అయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి చల్లా వంశీచంద్​ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్​ నుంచి మన్నె శ్రీనివాస్​ రెడ్డి తలపడగా శ్రీనివాస్​ రెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో ఆయా పార్టీల హైకమాండ్​లు మళ్లీ వీరికే పోటీ చేసే అవకాశాలు కల్పించాయి. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి పాలమూరు ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది.

అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు..

2019 లోక్​సభ ఎన్నికల్లో వంశీచంద్​రెడ్డి కాంగ్రెస్​ పార్టీ నుంచి బరిలో దిగగా, ఈసారి కూడా అతడినే మళ్లీ క్యాండిడేట్​గా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఈ పార్లమెంట్​ పరిధిలో 9,84,767 ఓట్లు పోల్​ కాగా, 65.39 శాతం  పోలింగ్​ నమోదైంది.​ఇందులో వంశీచంద్​ రెడ్డికి 19.67 శాతంతో 1,93,631 ఓట్లు పడ్డాయి. అయితే, అప్పట్లో ఈ పార్లమెంట్​ పరిధిలోని మహబూబ్​నగర్, జడ్చర్ల, దేవరకద్ర, షాద్​నగర్, కొడంగల్, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు ఉండడంతో కాంగ్రెస్​కు ఓటింగ్​ పర్సంటేజీ తగ్గింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు అసెంబ్లీ స్థానాలు హస్తగతమయ్యాయి. దీనికితోడు 2018లో పోల్చితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు ఓటింగ్​ శాతం పెరిగింది. 2018 ఎన్నికల్లో నారాయణపేట అసెంబ్లీలో కాంగ్రెస్​కు కేవలం 3.92 శాతం ఓట్లు పోల్​ కాగా, ఈ సారి రికార్డు స్థాయిలో 46.31 శాతం ఓట్లు పోల్​ అయ్యాయి. మహబూబ్​నగర్​లో 48.08 శాతం ఓట్లు పడ్డాయి. జడ్చర్లలో 30.85 శాతం నుంచి 50.03 శాతానికి

దేవరకద్రలో 34.91 నుంచి 45.31 శాతానికి పెరిగింది. అలాగే మక్తల్​లో 39.88 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. ఈ లెక్కల ప్రకారం పార్లమెంట్​ ఎన్నికల్లోనూ ఓటర్లు కాంగ్రెస్​ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ఉండడం వంశీచంద్​రెడ్డికి కలిసొచ్చే అంశంగా పేర్కొంటున్నారు.

డీకే అరుణను ఢీ కొట్టడం సవాలే!​

2019 ఎన్నికల్లో డీకే అరుణ బీజేపీ క్యాండిడేట్​గా పోటీ చేసి సెకండ్​ ప్లేస్​లో నిలిచారు. ఆమెకు 33.88 శాతంతో 3,33,573 పడ్డాయి. ఈ ఎన్నికల్లో కూడా ఆమెనే ఆ పార్టీ క్యాండిడేట్​గా బరిలో దించింది. అయితే ఈ ఎన్నికలు ఆమెకు కలిసొస్తాయని అంటున్నారు. ఈ పార్లమెంట్​ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్​ శాతం పెరగడమే కారణమని అంటున్నారు.

మహబూబ్​నగర్​ అసెంబ్లీలో 2018 ఎన్నికల్లో ఈ పార్టీకి 3,72 శాతం ఓట్లు పోల్​ అవగా, ఈసారి 10.97 శాతానికి పెరిగింది. జడ్చర్లలో 2.24 శాతం నుంచి 4.05 శాతానికి, దేవకరద్రలో 2.97 శాతం నుంచి 6.74 శాతానికి మక్తల్​లో 12.24 శాతం నుంచి 24.01 శాతానికి ఓట్ల పర్సంటేజీ పెరిగింది. పెరిగిన ఓటింగ్​ శాతం, ఈ ఎన్నికల్లో మోదీ చరిష్మా​ పని చేస్తే పార్లమెంట్  ఎన్నికల్లో డీకే అరుణను ఢీ కొట్టడం ప్రధాన పార్టీలకు సవాల్​గా మారనుందని అంటున్నారు.

సొంత ఇమేజ్​పైనే ఆశలు..

గత పార్లమెంట్​ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మన్నె శ్రీనివాస్​ రెడ్డి మహబూబ్​నగర్​ ఎంపీగా గెలిచారు. ఆయనకు 41.78 శాతంతో 4,11,402 ఓట్లు పోలయ్యాయి. 77,829 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆయన సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్​ నుంచి బరిలోకి దిగనున్నారు. అయితే అప్పట్లో ఈ పార్లమెంట్​ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు ఉండడం, తెలంగాణ సెంటిమెంట్​తో గెలుపు ఈజీ అయ్యింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. బీఆర్ఎస్​ అధికారం కోల్పోయింది. దీనికితోడు ఈ పార్లమెంట్​లో పార్టీ ఒక్క అసెంబ్లీని కూడా దక్కించుకోలేదు.

గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటింగ్​ పర్సంటేజీ కూడా తగ్గిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేటలో 42.25 శాతం నుంచి 40.97 శాతానికి, మహబూబ్​నగర్​లో 54.16 శాతం నుంచి 37.72 శాతానికి, జడ్చర్లలో 58.95 శాతం నుంచి 41.9 శాతానికి, దేవరకద్రలో 55.12 శాతం నుంచి 44.6 శాతానికి, మక్తల్​లో 47.77 శాతం నుంచి 30.55 శాతానికి ఓట్ల పర్సంటేజీ పడిపోయింది. దీంతో సిట్టింగ్​ ఎంపీ తన సొంత ఇమేజీపైనే ఆధారపడాల్సి వస్తుందని అంటున్నారు.