హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో వేలుపెట్టి మరో కేఏ పాల్ కావొద్దని పవన్ కళ్యాణ్కు పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ సూచించారు. బుధవారం ఆయన గాంధీభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సినిమా హీరోగా పవన్ కళ్యాణ్కు తెలంగాణలో అభిమానులు ఉన్నారని, ఆయన ఇక్కడి ప్రజలతో హుందాగా వ్యవహరించాలన్నారు.
ఇక్కడకు వచ్చి సినీ గ్లామర్ను రాజకీయాలకు వాడుకుంటాను అనుకుంటే జనం దృష్టిలో మరో కేఏ పాల్ అవుతారని హెచ్చరించారు. అయినా రేవంత్రెడ్డి సీఎంగా ఉన్నంత వరకు తెలంగాణ గడ్డపై వేరే ప్రాంత గద్దలకు చోటు ఉండదన్నారు. తెలంగాణను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తమకు తెలుసని, పక్క రాష్ట్రం నుంచి పెయిడ్ ఆర్టిస్టులు, అద్దె లీడర్లు ఇక్కడకు రావాల్సిన అవసరం లేదని అన్నారు.
