
- బనకచర్ల పాపం కేసీఆర్దే
- కమీషన్లకు కక్కుర్తిపడిగోదావరి నీటి తరలింపునకు ఒప్పుకున్నడు: సీఎం రేవంత్
- ఏపీ ప్రాజెక్టులకు పెద్దన్నగా ఉంటానన్నడు
- నీళ్ల విషయంలో అన్యాయం జరిగితే హరీశ్, కేసీఆర్ను ఉరి తియ్యాలి
- తెలంగాణ నీటి ప్రయోజనాలకు గత ప్రభుత్వం ఏమీ చెయ్యలే
- కృష్ణా బేసిన్లో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చెయ్యలే
- తెలంగాణకు రావాల్సిన జలాలకు ఎన్వోసీ ఇచ్చి
- మిగిలిన నీళ్లు ఏమైనా చేస్కోవాలని అల్టిమేటం
హైదరాబాద్, వెలుగు: బనకచర్ల అంశంపై ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.‘‘ చంద్రబాబూ.. మీకు కేంద్రంలో పలుకుబడి ఉందనుకోవద్దు. బనకచర్లను ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు. కృష్ణా జలాల్లో 555 టీఎంసీలు, గోదావరిలో వెయ్యి టీఎంసీల నీటిని వాడుకునేందుకు తెలంగాణకు ఎన్వోసీ ఇస్తే మీ ప్రాజెక్టులపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. ’ అని ఏపీ సీఎంను ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
బనకచర్ల ప్రాజెక్టు పాపం ముమ్మాటికీ మాజీ సీఎం కేసీఆర్దేనని, కమీషన్లకు కక్కుర్తిపడి రాయలసీమకు గోదావరి జలాల తరలింపునకు ఒప్పుకున్నాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఏదైనా జరిగితే హరీశ్, కేసీఆర్ను ఉరి తియ్యాలని ఫైర్ అయ్యారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను గత ప్రభుత్వం కాపాడలేదని, కృష్ణా బేసిన్లో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని విమర్శించారు.
గోదావరిలో 3వేల టీఎంసీల మిగులు జలాలున్నాయన్న కేసీఆర్ మాటలు నమ్మి చంద్రబాబు బనకచర్ల కడుతున్నారని, కానీ బనకచర్లను ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసని పేర్కొన్నారు. ఒకవేళ కృష్ణా జలాల్లో 555 టీఎంసీలు, గోదావరిలో వెయ్యి టీఎంసీల నీటిని వాడుకునేందుకు తెలంగాణకు చంద్రబాబు ఎన్వోసీ ఇస్తే.. వాళ్ల ప్రాజెక్టులకు తాము ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని అన్నారు.
బనకచర్లపై అఖిలపక్ష ఎంపీలతో నిర్వహించిన సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో గోదావరి జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు, నిర్మాణాలు, అనుమతులు, వివాదాలు, వాటి రాజకీయ నేపథ్యంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించినట్లు సీఎం తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రిగా తనను, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డిని, కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ని, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్పార్టీల పార్లమెంట్ సభ్యులందరినీ ఆహ్వానించి, అన్ని అంశాలపై క్లారిటీ
ఇచ్చారన్నారు.
ఎలాంటి రాజకీయ ప్రయోజనాలకు తావు ఇవ్వకూడదన్న ఆలోచనతోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేశామని, కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రతినిధిగా వచ్చిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రాజు రవిచంద్ర సమావేశం నుంచి వాకౌట్చేశారన్నారు. లీడర్ను పంపుతారనుకుంటే రీడర్ను పంపారని, ఆయన బీఆర్ఎస్ పెద్దలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి మధ్యలోనే వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.
బనకచర్లకు పునాది వేసింది కేసీఆరే..
బనకచర్లకు పునాది వేసింది కేసీఆర్, హరీశ్ రావేనని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టర్ ఇచ్చే కమీషన్ల కోసం ఈ ప్రాజెక్టుకు మాజీ సీఎం కేసీఆర్అంగీకరించారని మండిపడ్డారు. ఆ కుట్రదారుల్లో ఒకరైన హరీశ్రావు ఇప్పుడు బయటకు వచ్చి గోదావరి నీళ్లను చంద్రబాబు దోచుకెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తగనే కూర్చున్నాడంటూ తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు.
‘‘బనకచర్ల పాపానికి పునాది వేసింది మీ మామ. ఆరోజు జరిగిన సమావేశంలో మంత్రిగా నువ్వే ఉన్నావ్. అయితే గియితే ఎవరినైనా శిక్షించాలంటే మీ ఇద్దరినే శిక్షించాలి. ఒకవేళ గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగితే ఉరితీయాల్సింది చంద్రశేఖర్ రావును, హరీశ్ రావునే’’ అని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గోదావరి, కృష్ణా నదీ జలాలకు సంబంధించి 2016 ఫిబ్రవరి 21న ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.
‘‘జలశక్తి మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నాటి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సాగునీటి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, తెలంగాణ నాటి సాగునీటి మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఆ సమావేశం మినిట్స్ కు సంబంధించిన ఎనిమిది పేజీల్లోని ఆరో పేజీలో ‘గోదావరి నుంచి ఏటా 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. కృష్ణా బేసిన్ మీద నిర్మించాల్సిన ప్రాజెక్టులకు వెయ్యి టీఎంసీలు అవసరం. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ కు గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు’ అని కేసీఆర్ప్రతిపాదించారు.. ఆ సమావేశంలో జరిగిన నిర్ణయం మేరకే ఇప్పుడు బనకచర్లను ఏపీ సీఎం చంద్రబాబు ముందుకుతెచ్చారు’’ అని సీఎం రేవంత్రెడ్డి వివరించారు.
ఏపీ ప్రాజెక్టులకు కేసీఆర్ పెద్దన్నగా ఉంటానన్నరు
2019లో జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం అయ్యాక..ఆయనతో అప్పటి సీఎం కేసీఆర్ నాలుగు సార్లు సమావేశమయ్యారని రేవంత్ తెలిపారు. ఈ సందర్భంగా ‘‘జలబంధం, గోదావరిలో సాగుదాం, రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు సహకరిస్తాం, స్నేహగీతిక, నదీ జలాల వివాదాల పరిష్కారం, గోదావరి జలాలు రాయలసీమకు తరలింపు’’ తదితర హెడ్లైన్స్తో పత్రికల్లో వచ్చిన వార్తలను సీఎం రేవంత్ ప్రస్తావించారు.
కేసీఆర్, జగన్ 2019లో ప్రగతిభవన్లో సమావేశమైనప్పుడు ఏపీ ప్రాజెక్టులకు తాను పెద్దన్నగా సహకరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రాయలసీమ పర్యటన సందర్భంగా రోజా ఇంటి దగ్గర కేసీఆర్ ఏం మాట్లాడారో కూడా వీడియో రికార్డులు ఉన్నాయన్నారు. ఇప్పుడవన్నీ చూపించే ఏపీ బనకచర్ల ప్రాజెక్టును కడుతున్నదని సీఎం రేవంత్ అన్నారు.
కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నిర్లక్ష్యం
కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులపై బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తీవ్ర నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన ఒక్క ప్రాజెక్ట్నైనా పదేండ్ల కాలంలో కేసీఆర్ పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల కోసమే ఇప్పటిదాకా రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. అయినా కూడా పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని నిలదీశారు.
‘‘పాలమూరు జిల్లాలో రూ.1500 కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి, రూ.600 కోట్లతో కంప్లీట్ అవ్వాల్సిన కోయిల్సాగర్, బీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులనూ పూర్తి చేయలేదు. నల్గొండ జిల్లాలో మొదలుపెట్టిన ఎస్ఎల్బీసీని పెండింగ్పెట్టారు. ఖమ్మం జిల్లాలో ఇందిరాసాగర్, రాజీవ్సాగర్ సహా గోదావరి బేసిన్లో మొదలుపెట్టిన ప్రాణహిత –చేవెళ్ల, దేవాదుల వంటి ప్రాజెక్ట్లను పట్టించుకోలేదు.
కాంగ్రెస్ హయాంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ కట్టి ఉంటే లిఫ్ట్ అవసరమే లేకుండా నీళ్లు వచ్చేవి. కానీ, అక్కడ తట్టెడు మట్టి కూడా తీయకపోవడంతో ఎడారిగా మారింది. కానీ కాసుల కక్కుర్తితో తుమ్మడిహెట్టిని వదిలేసి.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టారు. మేడిగడ్డ మూడేండ్లలోనే కూలిపోయింది. రూ.లక్ష కోట్లు ఆవిరయ్యాయి. లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకూ నీళ్లు రాలేదు’’ అని సీఎం అన్నారు. కానీ, తమ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. సీతారామకు నీటి కేటాయింపులు తమ ప్రభుత్వమే తీసుకొచ్చిందని గుర్తు చేశారు. సమ్మక్కసాగర్ను కొలిక్కి తెచ్చామని, పాలమూరు– రంగారెడ్డికీ నీటి కేటాయింపులపై ఓ స్టేజ్కు తీసుకొచ్చామని పేర్కొన్నారు.
హరీశ్ రావ్..చిల్లర చేష్టలు మానుకో
గోదావరి, కృష్ణా జలాలపై తమ ప్రభుత్వానికి బాధ్యత లేదన్నట్టుగా బద్నాం చేసేందుకు హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని, ఆ చిల్లర చేష్టలు మానుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘‘మేడిగడ్డలో ఒక్క పిల్లర్కుంగితే ఏమవుతుంది? అని హరీశ్ అంటున్నారు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిది అని మీరే అన్నారు కదా? మరి మీ గుండెను తీసి పక్కకు పెడితే మీ ప్రాణం ఉంటదా?’’ అని ప్రశ్నించారు.
బనకచర్లను ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు..
3 వేల టీఎంసీల మిగులు జలాలు గోదావరిలో ఉన్నాయని కేసీఆర్చెప్పడం వల్లే చంద్రబాబు బనకచర్ల చేపట్టారని, కానీ, గోదావరి బేసిన్లో తెలంగాణకు 968 టీఎంసీలు, ఏపీకి 518 టీఎంసీల కేటాయింపులు మాత్రమే ఉన్నాయని సీఎం గుర్తుచేశారు. ‘‘గోదావరిపై మా తెలంగాణ కట్టిన ప్రాజెక్టులకు 968 టీఎంసీలు వాడుకోవడానికి ముందుగా అనుమతులు రావాలి.
మేం ప్రాజెక్టులు కట్టి వాడుకున్నాక మిగిలిన నీళ్లు కిందకు పోతే అవి ఏపీ తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు.. కానీ ఏపీ ప్రభుత్వం మా సమ్మక్కసాగర్, సీతరామ సాగర్తో పాటు గోదావరిలోని అన్ని ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నది.. అభ్యంతరాలు చెబుతూ అనుమతులు రాకుండా చేస్తున్నది.. ఇప్పుడేమో మిగులు జలాల పేరు చెప్పి చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నారు. అసలు మిగులు జలాలు ఎక్కడున్నయ్? ఉంటే 3000 టీఎంసీల్లో 1500 టీఎంసీలు తెలంగాణకు ఇచ్చేలా ఏపీ సీఎం చంద్రబాబు ఎన్వోసీ ఇవ్వాలి.
తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహం వల్ల ఏపీకి నీళ్లు వరదలెక్క వస్తున్నయ్. మేడిగడ్డ కూలిపోయింది. సుందిళ్ల అక్కరకు రాలే. అన్నారం గురించి చెప్పాల్సిన పనేలేదు. అవే సక్కగుంటే ఆ నీళ్లు ఎత్తిపోసుకునేటోళ్లం. అప్పుడు ఏపీకి నీళ్లు వస్తుండెనే రాకుండెనో తెలుస్తుండే’’ అని అన్నారు. మోదీ, చంద్రబాబు నడుమ అంబికా దర్బార్బంధం ఉందని ఎద్దేవా చశారు. మోదీకి చంద్రబాబు మద్దతు అవసరముంటే.. చంద్రబాబుకు ప్రాజెక్టులకు అనుమతులు కావాలని..అందుకే వారు పరస్పరం సహకరించుకుంటున్నారని అన్నారు.
‘‘చంద్రబాబూ.. మీకు కేంద్రంలో పలుకుబడి ఉందనుకోవద్దు. బనకచర్లను ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు. కృష్ణా జలాల్లో 555 టీఎంసీలు, గోదావరిలో వెయ్యి టీఎంసీల నీటిని వాడుకునేందుకు తెలంగాణకు ఎన్వోసీ ఇస్తే మీ ప్రాజెక్టులపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. ’ అని ఏపీ సీఎంను ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
బనకచర్లను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నం
బనకచర్ల ప్రాజెక్టును మొదలుపెడతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్న మరుక్షణం తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్కు ఫిర్యాదు చేశామని సీఎం రేవంత్చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. ఇటీవల జలసౌధలో కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేసే సందర్భంలో జీఆర్ఎంబీ చైర్మన్తో సమావేశమై బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరామని గుర్తుచేశారు. ‘‘ప్రస్తుతం 200 టీఎంసీలనే తీసుకెళ్తున్నామని ఏపీ చెబుతున్నా.. భవిష్యత్తులో 300 టీఎంసీలు తరలించేందుకు వీలుగా పనులు చేస్తున్నది.
అంటే అదనంగా వంద టీఎంసీలకు ఎప్పుడంటే అప్పుడు పంపులను తీసుకొచ్చి ఫిట్ చేసుకోవచ్చు. దీనిపై ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడిన వెంటనే.. నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి జీఆర్ఎంబీకి స్వయంగా ఫిర్యాదు చేశాం. కేంద్ర జలశక్తి శాఖ, ఆర్థిక శాఖలకూ కంప్లయింట్ ఇచ్చినం. కేంద్రం ఆర్థిక సాయం చేయడంతోపాటు వివిధ బ్యాంకుల నుంచి ఎఫ్ఆర్బీఎం బయట కూడా లోన్లు తీసుకునేలా కేంద్రం సహకరిస్తున్నదని తెలిసింది. అందుకే వీటన్నింటినీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరాం.
దీనిపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కూడా మాకు లేఖ రాశారు. ఏపీ నుంచి ప్రాజెక్ట్ రిపోర్టు అందలేదని చెప్పారు. తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా అనుమతులు ఇవ్వబోమని హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎక్కడా నిర్లక్ష్యంగా ఉండట్లేదు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం’’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్నేతలు ఏం మాట్లాడారు? అధికారం పోయాక ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? చచ్చిపోయిన పార్టీని బతికించుకునేందుకు సెంటిమెంట్ ను ఎలా రాజేస్తున్నారు? ఎలాంటి అబద్ధపు ప్రచారాలతో ముందుకు వెళ్తున్నారనేది.. చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. అప్పట్లో కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో కేసీఆర్, హరీశ్రావు పాల్గొన్నరు. కాంట్రాక్టర్ సూత్రధారి అయితే మీరిద్దరు పాత్రధారులు. కమీషన్లకు కక్కుర్తి పడి గోదావరిలో 400 టీఎంసీల వరద జలాలను రాయలసీమలోని పెన్నా బేసిన్కు తరలించేందుకు ఒప్పుకున్నారు.
- సీఎం రేవంత్