చత్తీస్‌‌గఢ్‌‌ లో భారీ ఎన్‌‌ కౌంటర్‌‌‌‌..12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మృతి

చత్తీస్‌‌గఢ్‌‌ లో భారీ ఎన్‌‌ కౌంటర్‌‌‌‌..12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మృతి
  • మరో ఇద్దరు జవాన్లకు గాయాలు
  • బీజాపూర్​ జిల్లాలో బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు
  • తుపాకుల మోతతో దద్దరిల్లిన బస్తర్​ అటవీ ప్రాంతం
  • మావోయిస్టుల మృతదేహాలతోపాటు భారీగా 
  • ఆయుధాలు స్వాధీనం చేసుకున్న బలగాలు
  • పీఎల్జీఏ వారోత్సవాల వేళ మావోయిస్టులకు ఎదురుదెబ్బ

భద్రాచలం, వెలుగు: చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో భారీ ఎన్‌‌‌‌కౌంటర్​ జరిగింది. బీజాపూర్‌‌‌‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకోగా.. తుపాకీ మోతలతో బస్తర్‌‌‌‌‌‌‌‌ అటవీప్రాంతం దద్దరిల్లింది. ఈ కాల్పుల్లో  12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మృతి చెందారు. 

మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలతోపాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బీజాపూర్, దంతెవాడ జిల్లాల బార్డర్‌‌‌‌‌‌‌‌లోని వెస్ట్​ బస్తర్​ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో డీఆర్‌‌‌‌‌‌‌‌జీ, ఎస్టీఎఫ్​, కోబ్రా, సీఆర్పీఎఫ్‌‌‌‌​ బలగాలను జాయింట్​ ఆపరేషన్​ కోసం పంపించారు. 

బీజాపూర్​ జిల్లా గంగులూరు అడవుల్లో ఆపరేషన్​ కొనసాగుతున్న సమయంలో మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. తేరుకున్న భద్రతా బలగాలు సైతం ప్రతిదాడికి దిగాయని బస్తర్​ ఐజీ సుందర్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌, బీజాపూర్​ ఎస్పీ జితేంద్రయాదవ్ తెలిపారు.  12 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు చెప్పారు. 

మావోయిస్టుల కాల్పుల్లో బీజాపూర్​ జిల్లా డీఆర్‌‌‌‌‌‌‌‌జీకి చెందిన హెడ్​ కానిస్టేబుల్​ మోనూ వడారీ, కానిస్టేబుళ్లు రమేశ్‌‌‌‌​ సోడి, దుకారూ గోండి కన్నుమూసినట్టు వివరించారు.  మరో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడగా.. వారిని గంగులూరు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించినట్టు చెప్పారు. సంఘటనా ప్రదేశంలో భారీ సంఖ్యలో ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ఆర్​, 303 రైఫిల్స్, ఇన్సాస్​ తుపాకులు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చనిపోయినవారిని గుర్తించేందుకు లొంగిపోయిన మావోయిస్టులను రప్పిస్తున్నామని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామన్నారు. 

పీఎల్జీఏ వారోత్సవాల వేళ..

పీఎల్జీఏ వారోత్సవాల వేళ మావోయిస్టులకు ఇది గట్టి ఎదురుదెబ్బ. మరోవైపు పీఎల్జీఏ బెటాలియన్​ వన్​ కమాండర్​ బార్సే దేవా లొంగిపోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఆయన సుక్మా జిల్లా అడవులను సురక్షితమైన కారిడార్‌‌‌‌‌‌‌‌గా ఏర్పాటు చేసుకొని లొంగిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తున్నది. 

ఈ క్రమంలో భారీ ఎన్‌‌‌‌కౌంటర్ జరగడం గమనార్హం. మృతులను గుర్తిస్తే కానీ ఎవరు చనిపోయారు? అగ్రనేతలు ఎవరైనా ఉన్నారా? అనే విషయాలు తెలియనున్నాయి. మరోవైపు బ్యాకప్​ బలగాలతో గంగులూరు ప్రాంతంలో కార్డెన్​ సెర్చ్ జరుగుతున్నది. పారిపోయిన మావోయిస్టుల కోసం అడవిని బలగాలు జల్లెడపడుతున్నాయి. 

4 రోజుల క్రితమే ప్రధాని సమావేశం..

చత్తీస్‌‌‌‌గఢ్​ రాష్ట్రంలోని రాయ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో 4 రోజుల క్రితమే ఆలిండియా డీజీపీలు, ఐజీలతో  ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌‌‌‌ దోవల్  సమావేశం నిర్వహించారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను నిర్మూలించాలని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. 

ఈ క్రమంలోనే చత్తీస్‌‌‌‌గఢ్​ పోలీసులు బుధవారం భారీ ఎన్‌‌‌‌కౌంటర్​ జరగడం చర్చనీయాంశం అయింది. కాగా, ఈ కాల్పుల్లో మృతి చెందిన డీఆర్‌‌‌‌‌‌‌‌జీ జవాన్లకు చత్తీస్‌‌‌‌గఢ్​ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి విజయ్​శర్మ  శ్రద్ధాంజలి ఘటించారు. మావోయిస్టులపై విరుచుకుపడ్డ వీరజవాన్లు అంటూ కీర్తించారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తుదిశ్వాసపై నడుస్తున్నదని, త్వరలోనే మావోయిస్టులందరినీ తుదముట్టిస్తామని హెచ్చరించారు.