- టెలికాం కంపెనీల పేర్లతో కాల్స్
- లింక్స్ పంపిస్తున్న సైబర్ నేరగాళ్లు
- ఓపెన్ చేయగానే సిమ్ కార్డ్ యూనిక్ నంబర్లతో డీయాక్టివేట్
- కార్డు స్వైపింగ్తో అకౌంట్లు ఖాళీ
- అలర్ట్ గా ఉండాలంటున్న పోలీసులు
హైదరాబాద్, వెలుగు: టెలికాం సర్వీసెస్లో ప్రస్తుతం 4జీ సేవలు అందుబాటులో ఉండగా.. వీటి స్థానంలో అప్ గ్రేడ్ వెర్షన్ 5జీ అందుబాటులోకి వచ్చింది. ప్రైవేటు టెలికాం నెట్వర్క్ కంపెనీలు పోటీపడి 5జీ సర్వీసును అందిస్తున్నాయి. సిమ్ కార్డులు అప్గ్రేడ్ చేసుకునేందుకు ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. 5జీ వెర్షన్ స్మార్ట్ ఫోన్లు, సిమ్ కార్డులను మార్కెట్లోకి విడుదల చేశాయి. దీన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా చేసుకున్నారు.5జీ నెట్వర్క్ను టార్గెట్ చేశారు. సిమ్ అప్గ్రేడ్ పేరుతో కాల్స్ ఎస్ఎంఎస్ లింక్స్ పంపిస్తున్నారు. లింక్స్ ఓపెన్ చేసిన వారి అకౌంట్ల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇలాంటి మోసాలపై సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చిన సమాచారంతో సైబర్క్రైమ్ పోలీసులు అలర్ట్ అయ్యారు.
సిమ్ అప్గ్రేడ్ చేసుకోవాలని లింక్స్
ప్రముఖ టెలికాం కంపెనీల పేర్లతో మొబైల్ యూజర్లకు లింక్స్ పంపిస్తున్నారు. సిమ్ అప్గ్రేడ్ చేసుకోవాలని మెసేజ్లు చేస్తున్నారు. సిమ్కార్డ్ మార్పిడి, ఆఫర్లతో వల వేయడం, పోర్టబులిటీకి సంబంధించి ఓటీపీలు సేకరిస్తున్నారు. వర్చువల్ నంబర్స్తో కాల్స్ చేస్తున్నారు. 4జీ నుంచి 5జీకి అప్గ్రేడ్ చేస్తామని చెబుతుంటారు. అప్డేట్ చేసుకోకపోతే సర్వీస్ నిలిచిపోతుందని అయోమయానికి గురి చేస్తున్నారు. పరిమిత గడువులోగా సిమ్ను తప్పనిసరిగా 5జీలోకి మార్చుకోవాలని బెదిరిస్తుంటారు. సిమ్ కార్డ్ ఎవరి పేరుపైన ఉంది. అడ్రస్ ప్రూఫ్స్ గురించి తెలుసుకుంటారు. సిమ్ కార్డ్పై ఉన్న 20 అంకెల యూనిక్ సీరియల్ నెంబర్ చెప్పాలని అడుగుతారు. ఇలా సిమ్ యూనిక్ నంబర్ సేకరించిన తర్వాత సంబంధిత సిమ్ కార్డ్ నెట్వర్క్ కంపెనీకి కాల్ చేస్తారు.
యూనిక్ నంబర్తో సిమ్ స్వైపింగ్, అకౌంట్స్ ఖాళీ
సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ కస్టమర్ కేర్కు కాల్స్ చేస్తారు. సిమ్ యూనిక్ నంబర్ చెప్పి అదే నంబర్తో మరో సిమ్ కార్డ్ తీసుకుంటారు. దీంతో నిజమైన యూజర్ సిమ్ కార్డ్ డీయాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత మొబైల్ నంబర్కు వచ్చే బ్యాంక్ మెసేజ్లు, నెట్బ్యాంకింగ్ సహా పూర్తి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తమ ఆధీనంలోకి తీసుకుంటారు. గంటల వ్యవధిలోనే అకౌంట్ ఖాళీ చేస్తారు. దీంతో పాటు లింక్స్ పంపించి ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా సిమ్ అప్డేట్ అవుతుందని నమ్మిస్తారు. మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ చెప్పాలని అడుగుతారు. మొబైల్తో లింకైన బ్యాంక్ అకౌంట్స్, పర్సనల్ డాటా హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓటీపీ చెప్పిన తరువాత ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. సిమ్ అప్గ్రేడ్కు బదులు బ్యాంక్ అకౌంట్స్ నుంచి క్యాష్ కొట్టేస్తున్నారు.
ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు
5జీ అప్గ్రేడ్తో జరుగుతున్న మోసాలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీస్ వెబ్సైట్స్, సోషల్మీడియాలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సిమ్ అప్గ్రేడ్ పేరుతో మోసాలు జరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్కి వచ్చే లింక్స్, కాల్స్ నిజమైనవేనా అని నిర్ధారించుకున్న తర్వాతే ఓపెన్ చేయాలని సూచిస్తున్నారు. గుర్తు తెలియని నంబర్స్ నుంచి కాల్స్ వచ్చినా లింక్స్ వచ్చినా స్పందించకూడదని చెబుతున్నారు. అనుమానం వస్తే సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ను సంప్రదించాలని సూచిస్తున్నారు. అనుమాస్పద లింక్స్ ఓపెన్ చేయకూడదని సూచిస్తున్నారు. మోసం జరిగిన వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కి కాల్ చేసిన రిపోర్ట్ చేయాలని సూచిస్తున్నారు.
5జీ సేవలను ఉపయోగించడానికి 4జీ సిమ్కార్డ్లు అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. 5జీ మొబైల్ ఫోన్స్తో పాటే సిమ్ కార్డులు వస్తున్నాయి. సిమ్ అప్డేట్ పేరుతో సిమ్కార్డ్ యూనిక్ నంబర్ అడిగితే చెప్పకూడదు. అనుమానిత కాల్స్ మెసేజ్లు వస్తే అప్రమత్తం కావాలి. సిమ్ అప్గ్రేడ్ కోసం యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తుంటారు. వాటిని నమ్మకూడదు. మోసం జరిగితే http://www.cybercrime.gov.in ఫిర్యాదు నమోదు చేయాలి. టోల్ ఫ్రీ నంబర్ 1930కి డయల్ చేసి రిపోర్ట్ చేయాలి.
– శివమారుతి,ఏసీపీ,సిటీ సైబర్ క్రైమ్స్