- రెడ్క్రాస్ సొసైటీ చొరవ, సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ చేయూత
- బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్తో చిన్నారులకు పునర్జన్మ
- తొమ్మిది మందికి హెచ్ఎల్ఏ తొలిదశ పరీక్షలు పూర్తి
- తదుపరి టెస్టుల కోసం బెంగళూరు హాస్పిటల్కు ఆరుగురు
- ఒక్కో ఆపరేషన్కు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు ఖర్చు
మంచిర్యాల, వెలుగు: తలసేమియా బారిన పడి నరకం అనుభవిస్తున్న చిన్నారులకు బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. రెడ్క్రాస్ సొసైటీ చొరవ, సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో బెంగళూరులోని భగవాన్ మహవీర్ జైన్ హాస్పిటల్లో ఈ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. తలసేమియా శాశ్వత నివారణకు బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గం. దీనికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పైగా ఖర్చువుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో ఎక్కువ మంది పేద కుటుంబాల పిల్లలే. లక్షలు ఖర్చుపెట్టి ఆపరేషన్ చేయించే స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో నెలనెలా రక్తం ఎక్కించడానికి అవస్థలు పడుతున్నారు.
రాష్ట్రంలో 10వేల మంది..
రాష్ట్రవ్యాప్తంగా తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులు దాదాపు 10 వేల మంది ఉన్నారు. ఉత్తర తెలంగాణలో మెజారిటీ సంఖ్యలోఉండగా, ఇందులో ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 2 వేల మందికి పైగా ఉన్నారు. ఇది జన్యు సంబంధమైన వ్యాధి. ఎముక మూలుగులోని హిమోగ్లోబిన్లో ఉండే ఎర్ర రక్తకణాల ఉత్పత్తి నిలిచిపోతుంది. దీంతో శరీరానికి అవసరమైనంత రక్తం ఉత్పత్తి కాదు. ఒకవేళ ఉత్పత్తి అయినా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. హిమోగ్లోబిన్ నిల్వలు పడిపోయిన ప్రతిసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. సకాలంలో రక్తం అందించకపోతే ప్రాణాలకే ప్రమాదం. మంచిర్యాలలోని రెడ్క్రాస్ బ్లడ్బ్యాంక్లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి వచ్చే చిన్నారులకు ప్రతి నెలా రక్తం ఎక్కిస్తున్నారు. రక్తదాతల సహకారంతో ఎంతోమంది పిల్లల ప్రాణాలను కాపాడుతున్నారు.
దాతల సహకారంతో పునర్జన్మ..
మంచిర్యాల గర్నమెంట్ హాస్పిటల్లోని బ్లడ్ బ్యాంక్ ద్వారా తలసేమియా బాధిత చిన్నారులకు ఫ్రీగా రక్తం అందిస్తున్నాం. ఇటీవల సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ ద్వారా మహవీర్ జైన్ హాస్పిటల్లో పేద పిల్లలకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తున్నాం. ఇందుకయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షలు చెల్లిస్తుంది. ఆర్థిక పరిస్థితిని బట్టి పిల్లల తల్లిదండ్రులు మరో రూ.3లక్షల దాకా భరించాలి. మిగిలిన మొత్తాన్ని దాతల సహకారంతో సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ సమకూర్చుతుంది. దాతలు ముందుకు వస్తే మరికొందరు పిల్లల ప్రాణాలను కాపాడవచ్చు
రెడ్క్రాస్ చొరవ, సంకల్ప్ చేయూత..
మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లోని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ద్వారా చాలా కాలం నుంచి తలసేమియా చిన్నారులకు రక్తం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ ద్వారా మహవీర్ జైన్ హాస్పిటల్లో పేద పిల్లలకు బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తున్నారు. రామకృష్ణాపూర్కు చెందిన వేల్పుల అయన(7) అనే చిన్నారికి ఈ నెల 8న ఆపరేషన్ జరిగింది. ఇటీవల నిర్వహించిన హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్(హెచ్ఎల్ఏ) టైపింగ్ క్యాంప్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన బాధితులకు తొలి దశ టెస్టులు చేశారు.
తొమ్మిది మందికి వారి తల్లిదండ్రులు, తోబుట్టువుల బోన్ మ్యారో మ్యాచ్ అయింది. వారిలో ఆరుగురికి తుది దశ టెస్టులు చేసి ఆపరేషన్లు నిర్వహించేందుకు మహవీర్ జైన్ హాస్పిటల్కు ఆదివారం పంపించారు. వీరిలో నేరెళ్ల పండు (మందమర్రి), బానాల శివకుమార్ (కౌటాల), కొత్తపల్లి భార్గవ్(చెన్నూర్), కె.అజయ్ (జగిత్యాల), కె.అశ్విత (జగిత్యాల), దుర్గం వినయ్ (కోటపల్లి) ఉన్నారు. వీరికి బెంగుళూర్లో టెస్ట్లు పూర్తి చేశారు. రెండు నెలల తరువాత వీరికి బోన్ మ్యారో సర్జరీలు చేయనున్నారు. అలాగే సింగరేణి సంస్థ ఆర్థిక సహకారంతో హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో ముగ్గురు చిన్నారులకు బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు.
అయనకు పునర్జన్మ..
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్కు చెందిన వేల్పుల సతీశ్, రాణి దంపతుల కూతురు అయన(7) ఏడాదిన్నర వయసులో తలసేమియాను గుర్తించారు. అప్పటి నుంచి మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లోని ఐఆర్సీఎస్ బ్లడ్బ్యాంక్లో రక్తం ఎక్కిస్తున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన క్యాంప్లో తల్లిదండ్రులతో పాటు అన్న ప్రశ్నిత్(12)కు బోన్ మ్యారో టెస్ట్ చేయగా, ప్రశ్నిత్తో మ్యాచ్ అయింది. ఈ నెల 8న బెంగళూరులోని మహవీర్ జైన్ హాస్పిటల్లో ప్రశ్నిత్ నుంచి బోన్ మ్యారో సేకరించి అయనకు ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. ప్రస్తుతం బాలిక అక్కడే కోలుకుంటోంది. ఆపరేషన్ తర్వాత మూడు నెలలపాటు హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని తండ్రి సతీశ్తెలిపాడు..