- అర్ధరాత్రి ప్రైవేటు స్కూల్లోకి చొరబడ్డ దుండగులు
- రిసెప్షన్ కౌంటర్లో రూ. 7.85 లక్షలు చోరీ
చందానగర్, వెలుగు: ఐటీ కారిడార్లో చెడ్డీ గ్యాంగ్ మరోసారి దోపిడీ చేసింది. మియాపూర్ ఇన్స్పెక్టర్ దుర్గా రామలింగప్రసాద్ కథనం ప్రకారం.. మియాపూర్ న్యూ హఫీజ్ పేట్లో వరల్డ్ వన్ స్కూల్లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి, చెడ్డీలు వేసుకుని కిటికీలో నుంచి లోపలికి ప్రవేశించారు. స్కూల్ రిసెప్షన్ అకౌంట్ సెక్షన్లో దాచిన రూ. 7.85 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం క్లీనింగ్ కోసం వచ్చిన సిబ్బంది చూసేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించి యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా స్కూల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు మాస్కులు ధరించి, చెడ్డీలు వేసుకొని దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. స్కూల్ మేనేజ్మెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. చెడ్డీ గ్యాంగ్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.