ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. సూపర్ కింగ్స్ జట్టులో లోకల్ ప్లేయర్ ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్ సుందర్ ను చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడింగ్ చేసుకోవడంలో విఫలమైంది. తమిళ వార్తల వెబ్సైట్ ప్రకారం.. ఐపీఎల్ 2026కి ముందు వాషింగ్టన్ సుందర్ను CSKకి రూ. 3.2 కోట్లకు విక్రయించడానికి గుజరాత్ టైటాన్స్ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే సుందర్ ను చెన్నై సూపర్ కింగ్స్ కు ఇచ్చే ఆలోచనలో గుజరాత్ లేనట్టు కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం.
రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సుందర్ తమకు మంచి రీప్లేస్ మెంట్ అని భావించిన చెన్నై యాజమాన్యంకు నిరాశే మిగిలింది. 2017లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన సుందర్.. ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరాడు. ఈ ఆల్ రౌండర్ కు కేవలం 6 మ్యాచ్ ల్లోనే మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. ఆరు మ్యాచ్ ల్లోనూ సుందర్ 133 పరుగులు చేసి 2 వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో సుందర్ అద్భుతంగా రాణించాడు. బౌలింగ్ లో నిలకడగా రాణించిన ఈ ఆల్ రౌండర్.. నాలుగో టీ20లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.
త్వరలో రిటైన్ ప్లేయర్లపై సమావేశం:
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను చర్చించడానికి త్వరలో మహేంద్ర సింగ్ ధోనీతో ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ త్వరలో సమావేశం కానున్నారు. రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై ఈ ముగ్గురూ చర్చించనుండగా.. తుది నిర్ణయం చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ (CSKCL) చైర్మన్గా నియమితులైన శ్రీనివాసన్ తీసుకుంటారు.
►ALSO READ | Richa Ghosh: టీమిండియా వికెట్ కీపర్కు అరుదైన గౌరవం.. డార్జిలింగ్లో రిచా ఘోష్ పేరిట కొత్త స్టేడియం
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసిన చెన్నై.. ఆ తర్వాత ఆడిన 9 మ్యాచ్ ల్లో 8 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఓవరాల్ గా 14 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. వచ్చే సీజన్ కోసం మంచి జట్టును తయారు చేస్తాం అని ఐపీఎల్ సమయంలోనే ధోనీ చెప్పాడు.
