
- వారం రోజుల్లో పరిహారం అందేలా చూస్తం
- భీమారంలో వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించినచెన్నూరు ఎమ్మెల్యే
- చెన్నూరులో 6.55 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- అర్హులకు తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తమని హామీ
- సింగరేణిలో కొత్త బొగ్గు గనులు ఏర్పాటు చేయాలని సీఎంను కోరినట్లు వెల్లడి
కోల్బెల్ట్/చెన్నూరు/జైపూర్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గంలో అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. పంట నష్టంపై రీసర్వే చేయాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించానని, ప్రభుత్వానికి నివేదిక పంపి పరిహారం అందేలా కృషి చేస్తానని చెప్పారు. శనివారం మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూరుగుపల్లి, నర్సింగాపూర్, కాజుపల్లి గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలను ఆయన పరిశీలించారు. నష్టపోయిన పంటను ఎమ్మెల్యేకు చూపిస్తూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేయగా, అండగా ఉంటామని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు.
అనంతరం చెన్నూరు మండలం ఒత్కులపల్లి నుంచి గంగారం వరకు రూ.3 కోట్లతో 2.27 కిలోమీటర్లు, సోమనపల్లి పంచాయతీలోని దుబ్బపల్లిలో రూ.3.55 కోట్ల సీఎస్ఆర్ ఫండ్స్తో 1.2 కిలోమీటర్ల పొడవున నిర్మించే సీసీ రోడ్లకు వివేక్ శంకుస్థాపన చేశారు. చెన్నూరు క్యాంప్ ఆఫీస్లో ఎంపీడీవోలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భీమారం మండలం పోతనపల్లి, బూరుగుపల్లి, నర్సింగాపూర్, కాజుపల్లి గ్రామాల్లో అకాల వర్షాలకు పంటలు డ్యామేజవడం బాధాకరమని, రైతులు ఆధైర్యపడవద్దని, అందరికి నష్టపరిహారం అందిస్తామని వివేక్ హామీ ఇచ్చారు.
పంటనష్టంపై ఆఫీసర్లు ప్రాథమిక సర్వే చేశారని, అందులో కొందరు రైతుల పేర్లు నష్టపోయినవారి లిస్టులో లేనట్టు తన దృష్టికి వచ్చిందని, వారి విషయంలో మరోసారి సర్వే చేయించాలని మంచిర్యాల కలెక్టర్ను ఆదేశించినట్లు చెప్పారు. రీ సర్వే చేసి 34శాతం పంట దెబ్బతిన్న రైతులకు పరిహారం వచ్చేలా చూడాలని సూచించినట్లు తెలిపారు. వారంరోజుల్లోనే నష్టపరిహారం అందేలా చూస్తానన్నారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలో కాళేశ్వరం బ్యాక్ వాటర్తో నాలుగైదు ఏళ్లు పంటలు నష్టపోయినా అప్పటి బీఆర్ఎస్సర్కార్ పట్టించుకోలేదని, తాను ఎమ్మెల్యే అయ్యాక సర్వే చేయించి రైతులకు నష్టపరిహారం ఇప్పించినట్లు ఆయన గుర్తుచేశారు.
డబుల్ బెడ్రూం పేరుతో పదేండ్లు మోసం
పదేండ్లలో మాజీ కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తానని చెప్పి, కట్టకుండానే ప్రజలను మోసం చేశారని వివేక్ విమర్శించారు. అదే బీఆర్ఎస్ వాళ్లు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లపై జనాలను రెచ్చగొడుతూ, తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. కోటపల్లి మండలం రోయ్యలపల్లి గ్రామస్తుడు ఇల్లు రాలేదని, విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని బీఆర్ఎస్తప్పుడు వార్తలు సృష్టించిందని చెప్పారు. నిజానికి వ్యాపారంలో నష్టపోవడంతోనే ఆ గ్రామస్తుడు ఆత్మహత్యాయత్నం చేశాడన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంలో తప్పిదాలుంటే ఎంపీడీవోలకు తెలపాలన్నారు. డబుల్ వెరిఫికేషన్ చేశాకే ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. కాంగ్రెస్సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని, ఎన్నికలప్పుడు హామీ ఇవ్వకపోయినా సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు. సన్నవడ్లకు సర్కార్రూ.500 బోనస్ ఇస్తోందని, రైతులకు ఎకరానికి రూ.10వేల ప్రయోజనం అదనంగా లభిస్తోందన్నారు. గ్యాస్సబ్సిడీ రానివారి సమస్యలను పరిష్కారించాలని ఎంపీడీవోలను ఆదేశిస్తున్నట్లు చెప్పారు.
కాళేశ్వరం కాంట్రాక్టర్ను కేసీఆర్ ధనవంతుడిని చేసిండు
తుమ్మిడిహెట్టి వద్ద రూ.36 వేల కోట్లతో ప్రాణిహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టి వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డిని ఒప్పించాడని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గుర్తుచేశారు. ప్రాజెక్టు కోసం కాంగ్రెస్సర్కార్రూ.12వేలు ఖర్చు చేసిందని, అది పూర్తయితే చెన్నూరు నియోజకవర్గంలో 55వేల ఎకరాలకు సాగునీరు అందేదని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కేవలం కమీషన్లు దోచుకోవడం కోసం రూ.1.25 లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడని ఆరోపించారు. వేల కోట్లు దోచిపెట్టిన కాంట్రాక్టర్ను ప్రపంచంలోనే ధనవంతుడిని చేశాడన్నారు. రూ.8లక్షల అప్పులు చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశాడని, కేసీఆర్చేసిన అప్పులను తీర్చేందుకు కాంగ్రెస్సర్కార్ వడ్డీ రూపంలో రూ.లక్షకోట్లు చెల్లిస్తోందని అన్నారు.
కొత్త బొగ్గు గనుల కోసం సీఎం దృష్టికి తీసుకువెళ్లా
రాబోయే కాలంలో సింగరేణి చాలా గనులు మూతపడుతాయని, కొత్త గనుల ఏర్పాటు అవశ్యకత, వాటిని తీసుకువచ్చే విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకవెళ్లినట్లు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి రూ.600 కోట్ల రుణం ఇప్పించి నష్టాల బాటలో ఉన్న సింగరేణి సంస్థను కాపాడారని గుర్తుచేశారు. సింగరేణి సంస్థ బొగ్గు బ్లాక్ల ఆక్షన్ లో పాల్గొని మైన్స్ దక్కించుకునేలా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఉద్యోగాలు కల్పించడంలేదని బాల్క సుమన్ ఆరోపణలు చేయడం తగదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు గనులు కేటాయింపు జరగలేదని వివేక్ ఫైర్ అయ్యారు. కొత్త గనులు లేకపోవడంతో ఉద్యోగాలు రావట్లేదన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం ఆందోళన వద్దు
ఇందిరమ్మ ఇండ్లు రావట్లేదని ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, అర్హులకు ఇండ్లు మంజూరు చేయించడం తన బాధ్యత అని వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై క్యాంప్ ఆఫీస్లో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావు, ఎంపీడీవోలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో జరిగిన సదస్సులో ఆయన పలు సూచనలు చేశారు. ఎలాంటి అవకతవకలు లేకుండా ఇండ్లు ఇస్తామని ఇదివరకే వీడియో ద్వారా చెప్పానని, ఈ విషయంలో ఎంపీడీవోలు, అధికారులతో ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించామన్నారు.
ఇండ్ల బిల్లుల మంజూరులో ఎలాంటి జాప్యం ఉండదన్నారు. లబ్దిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటిని నిర్మించుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ శాతం భూములు లేవని, వారికి సర్కార్ త్వరలోనే భూములు ఇస్తుందని, ఆ తర్వాత ఇండ్లు నిర్మించుకోవచ్చని చెప్పారు.