వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలె : వివేక్​ వెంకటస్వామి

వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలె : వివేక్​ వెంకటస్వామి
  •     చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి
  •     జైపూర్​ మండలంలో అభివృద్ధి పనుల ప్రారంభం

కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు : పేదలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, పల్లె దవాఖానా సేవలు సద్వినియోగం చేసుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి అన్నారు. బుధవారం జైపూర్​మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. శ్రీరాంపూర్​ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో రూ.31లక్షలతో మండలంలోని టేకుమట్లలో నిర్మించిన కమ్యూనిటీహాల్, వేలాల గ్రామంలో రూ.23లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం, గంగిపల్లిలో పల్లె దవాఖానా

మిట్టపెల్లిలో రూ.18 లక్షలతో నిర్మించిన మహిళా భవనాన్ని మంచిర్యాల జడ్పీ చైర్​పర్సన్​నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, శ్రీరాంపూర్​ ఏరియా సింగరేణి జీఎం సంజీవరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగరేణి ప్రభావిత గ్రామాలైన ఇందారం, టేకుమట్ల, రామారావు పేట యువతకు ఓసీపీల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని, స్టేడియం అందుబాటులోకి తీసుకవచ్చేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి జీఎం సంజీవరెడ్డిని ఆదేశించారు.

వేలాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన మల్లికార్జున స్వామి ఆలయం అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని, టూరిజం స్పాట్​గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. గంగిపల్లిలోని పల్లె దవాఖాన సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యేను సత్కరించారు. 

అంబేద్కర్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన వివేక్

గంగిపెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్​ అంబేద్కర్​ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. విగ్రహం అందించిన గ్రామ సర్పంచ్ పాలమాకుల లింగరెడ్డిని అభినందించారు. ప్రజలకు స్వేచ్చ, హక్కులు కల్పించిన ఘనత డాక్టర్​ బీఆర్ అంబేద్కర్​కు దక్కుతుందని, ఆయన అందరివాడని కొనియాడారు. మిట్టపెల్లి సర్పంచ్ కుంటాల సౌజన్య, ఉప సర్పంచి మధునయ్య ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఇన్విటేషన్​ వాలీబాల్​ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమాల్లో డీఆర్​డీఓ శేష్రాద్రి, జిల్లా పంచాయతీ ఆఫీసర్​వెంకటేశ్వర్లు, టేకుమట్ల, వేలాల, గంగిపల్లి, మిట్టపెల్లి సర్పంచులు, ఎంపీటీసీలు, తహసీల్దార్​ రమేశ్, ఎంపీడీవో సత్యనారాయణ, మెడికల్​ఆఫీసర్​ అనిల్​రావు, పీఏసీ చైర్మన్​ గుండు తిరుపతి, కాంగ్రెస్ ​లీడర్లు పాల్గొన్నారు. 

నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి

రాబోయే వేసవిలో నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మంచిర్యాలలోని తన నివాసంలో అధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. మిషన్​భగీరథ నీళ్లు రావడంలేదని ఫిర్యాదులు వస్తున్నాయని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య ఎక్కువ ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా వాటర్​ సప్లై చేయడానికి ముందస్తు ప్లాన్​ వేసుకోవాలని సూచించారు.