- 300 మంది ఖైదీల కోసం బ్యారక్ నిర్మాణం
- ఖైదీల సంక్షేమంలో దేశవ్యాప్తంగా గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: చర్లపల్లి సెంట్రల్ జైలు సంస్కరణలు, అప్గ్రేడ్లతో దేశంలో మోడ్రన్ జైలుగా పేరు తెచ్చుకుంది. మౌలిక సదుపాయాలు, ఖైదీల ఆరోగ్య సంరక్షణ, పునరావాసం జైలు పరిశ్రమల నిర్వహణలో ఆదర్శంగా నిలిచింది. 7వ ఆలిండియా ప్రి-సన్ డ్యూటీ మీట్ సందర్భంగా బ్యూరో ఆఫ్ పోలీస్ రీ-సెర్చ్ అండ్ డెవలప్మెంట్ నిర్వహించిన పరిశీలనలతో పరిశుభ్రతలో గోల్డ్ మెడల్ లభించింది.
ఈ మేరకు డీజీ సౌమ్య మిశ్రా, డీఐజీ శ్రీనివాస్, ఎస్పీ నవాబ్ శివకుమార్ గౌడ్ చేపట్టిన సంస్కరణలు చర్లపల్లి సెంట్రల్ జైలును దేశంలోనే మోడ్రన్ జైలుగా మార్చాయి. ఖైదీలతో పాటు విచారణ ఎదుర్కొంటున్న అండర్ ట్రయల్స్ ఖైదీల్లో మార్పు తెచ్చేందుకు జైలును ఆధునీకరించారు.
జైలులోని ఖైదీల ఆరోగ్య సంరక్షణకు 100 పడకల సామర్థ్యంతో హాస్పిటల్ అప్గ్రేడ్ చేశారు. అధునాతన ల్యాబ్ డిస్పెన్సరీని ఏర్పాటు చేశారు. ఖైదీలకు సంబంధించిన వ్యక్తిగత హెల్త్ ఫైళ్లను డిజిటలైజ్ చేసి రికార్డులను రూపొందించారుఖైదీల బ్యారక్లు, జైలు గోడలను పునరుద్ధరించారు. గత నాలుగేండ్లుగా నిలిచిపోయిన 300 మంది ఖైదీల సామర్థ్యంతో కూడిన బ్యారక్ భవన ప్రాజెక్టును తిరిగి ప్రారంభించారు.
జైలు పరిశ్రమ ఆధునీకరణ..
జైలు పరిశ్రమలను అధునాతన పరికరాలతో ఏర్పాటు చేశారు. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రామాణికం చేసి, జైళ్ల శాఖ లోగోతో బ్రాండ్ చేశారు. డీఅడిక్షన్ సెంటర్ కోసం ప్రత్యేక బ్యారక్ కేటాయించారు. డ్రగ్స్, గంజాయికి బానిసలైన ఖైదీల్లో మార్పు తెచ్చేందుకు కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సిబ్బంది వినియోగించని క్వార్టర్స్ను ఫంక్షన్ హాల్గా మార్చడంతో పాటు అవుట్సైడ్ ఎస్కార్ట్ పోలీసు సిబ్బంది కోసం కొత్త విశ్రాంతి గదులు నిర్మించారు.
ఈ ఏడాదిలో 7వ ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్ నిర్వహించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మంత్రి శ్రీధర్ బాబు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, ఆలిండియా, సెంట్రల్ సివిల్ సర్వీసెస్కు చెందిన 203 మంది ట్రైనీలు జైలును సందర్శించి, అధికారులను అభినందించారు.
