- బంజారాహిల్స్ పీఎస్ లో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కంప్లయింట్
హైదరాబాద్,వెలుగు : చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డిపై బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి శనివారం బంజారాహిల్స్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. “ ఎంపీ రంజిత్రెడ్డి నాకు కాల్ చేసి, మా పార్టీకి చెందిన సర్పంచులతో ఎందుకు మాట్లాడావు..? అని ప్రశ్నిస్తూ.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే నా వాళ్లను తీసుకెళ్లు’’.. అని తిట్టడడమే కాకుండా బెదిరించాడని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు. ఫోన్ నంబర్తో పాటు ఇతర ఆధారాలను పోలీసులకు అందించారు. అయితే.. బీఆర్ఎస్ సర్పంచులు కొందరు విశ్వేశ్వర్ రెడ్డితో టచ్లో ఉన్నారని తెలిసింది.
దీంతో ఎంపీకి ఆయనకు మధ్య వివాదం తలెత్తడమే కాకుండా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, దీంతో ఆగ్రహంతో రంజిత్రెడ్డి బూతులు తిట్టాడని విశ్వేశ్వర్రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. ఎంపీపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదుపై ముందుగా లీగల్ ఒపీనియన్ తీసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.