ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ

ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే అన్ని పార్టీలు ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి. తాజాగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక‌పై మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ  బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ తో సీఎం కేసీఆర్ చర్చించారు.

ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున ఎవరిని బరిలో దింపితే గెలుస్తారు..? ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి..? అనే వివరాలపై ఆరా తీశారు. టిక్కెట్ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి కష్టపడి పని చేయాలని, తప్పనిసరిగా మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేయాలని నాయకులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు కేబినెట్ భేటీకి ముందు మునుగోడు ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

మరోవైపు నిన్న రాత్రి మునుగోడు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీల‌తో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే. ఆ స‌మావేశం ముగిసిన అనంత‌రం జ‌గ‌దీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తులు లేరు అని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి 50 వేల మెజార్టీతో గెల‌వబోతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.