
- అనుమతుల్లేకుండాఆందోళనలు చేసిన ఎంపీ లక్ష్మణ్, స్టూడెంట్ లీడర్స్పై కేసు
- డ్యూటీలో ఉన్న పోలీసులపై రాళ్లతో దాడి చేశారని అభియోగాలు
హైదరాబాద్, వెలుగు: గ్రూప్స్ అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న రోజు ఆందోళన చేసిన పలువురిపై హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బృందావన్ గర్ల్స్ హాస్టల్ సమీపంలో అనుమతుల్లేకుండా రోడ్డుపై ధర్నా చేశారని, పోలీస్ అధికారులపై రాళ్ల దాడి చేసి గాయపరిచారని, డ్యూటీ చేయకుండా పోలీసులను అడ్డుకున్నారని ఇలా మొత్తం ఐదు సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ప్రధాన నిందితులుగా ఈశ్వర్, నాగేందర్, సురేశ్, అక్షయ్, కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్, రిజ్వాన్లను పేర్కొన్నారు.
వీరితో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్షణ్, బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ భాను ప్రకాశ్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనిల్ యాదవ్, ఓయూ జేఏసీ చైర్మన్ సురేశ్ యాదవ్, ఓయూ బీజేపీ స్టూడెంట్ లీడర్ జతంగి సురేశ్, ఓయూ ఏబీవీపీ స్టూడెంట్ లీడర్ జీవన్, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, సనత్నగర్ బీజేపీ నాయకురాలు నీలిమారెడ్డి సహా 13 మందిని నిందితులుగా చేర్చారు. మొత్తం 19 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వీరంతా విద్యార్థులను, నిరుద్యోగ అభ్యర్థులను తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టారని పోలీసులు కోర్టుకు తెలిపారు. స్టూడెంట్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగేలా స్లోగన్స్ ఇచ్చారన్నారు. డ్యూటీలో ఉన్న పోలీసులపై రాళ్లను విసిరేలా రెచ్చగొట్టారని పేర్కొన్నారు. రాళ్ల దాడిలో సిటీ ఆర్డ్మ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ ఏసీపీ కేవీర్ సత్యనారాయణ, సైఫాబాద్ ఎస్ఐ తరుణ్ కుమార్కు గాయాలయ్యాయని కోర్టుకు తెలిపారు.
కేసులపై విద్యార్థి సంఘాల ఆగ్రహం..
తమపై పోలీసులు కేసు నమోదు చేయడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిరుద్యోగ యువతకు అండగా ఉండే రాజకీయ నాయకులు, స్టూడెంట్ యూనియన్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డాయి. పదేండ్లుగా నిరుద్యోగుల జీవితాలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా కేసీఆర్ ప్రభుత్వం చేసిందని ఏబీవీపీ నాయకుడు జీవన్ ఫైర్ అయ్యాడు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఓయూ జేఏసీ చైర్మన్ సురేశ్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.