క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. పాతబస్తీలోని లాల్ దర్వాజా ఆలయాన్ని దర్శించడానికి వెళ్లిన చికోటి ప్రవీణ్ తన ప్రైవేట్ సెక్యూరిటీని వెంటబెట్టుకుని వెళ్లాడు. అయితే చికోటి ప్రవీణ్ తో ఉన్న ప్రయివేట్ సెక్యూరిటీ గన్లతో ఆలయంలోకి వచ్చారు. దీంతో విషయం తెలిసిన వెంటనే ఆలయానికి వచ్చిన పోలీసులు.. ప్రయివేట్ సెక్యూరిటీ నుంచి మూడు రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గన్ మెన్లను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు సౌత్ జోన్ డీసీపీ చైతన్య తెలిపారు. పబ్లిక్ ప్లేసుల్లో గన్ లు బయటకు తీయడం నిబంధనలకు విరుద్దమని..అందుకే గన్లను స్వాధీనం చేసుకుని వారి..గన్ మెన్లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
జులై 16వ తేదీ ఆదివారం లాల్ దర్వాజా సింహావాహిని మహంకాళి అమ్మవారి దర్శనానికి చీకటి ప్రవీణ్ కుమార్ తన ప్రయివేట్ సెక్యూరిటీతో వచ్చారు. తన ప్రైవేట్ సెక్యూరిటీని వెంటబెట్టుకుని ఆలయంలోకి వెళ్లారు. అయితే చికోటి ప్రవీణ్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ వద్ద గన్లు ఉండటంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. పబ్లిక్ లోకి ప్రైవేట్ సిబ్బంది గన్లతో రావడం చట్ట రీత్యా నేరం అని తెలియజేశారు. ముగ్గురు సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకున్నారు.
రాజకీయాల్లోకి వస్తా..
లాల్ దర్వాజా సింహావాహిని మహంకాళి అమ్మవారి దర్శనం కోసం మాత్రమే వచ్చానని...ఆలయం లోపలికి గన్స్ తో వెళ్ళలేదని చికోటి ప్రవీణ్ స్పష్టం చేశారు. తనకు ప్రాణహాని ఉన్న కారణంగానే బారీకేడ్స్ వరకు సెక్యూరిటీతో వెళ్లానని తెలిపారు. అన్ని అనుమతిలతో గన్స్ సెక్యురిటీ ఏర్పాటు చేసుకున్నానని ఆయన క్లారిటీ ఇచ్చాడు. తన విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. తాను హిందూ ధర్మం కోసం పోరాడుతుంటే తట్టుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న అన్ని అనుమతుల పత్రాలు పోలీసులకు ఇస్తానన్నారు.
త్వరలో రాజకీయాల్లోకి వస్తానని తెలియడంతో కొందరు తనపై కక్ష కట్టారని ప్రవీణ్ ఆరోపించారు.