హైదరాబాద్: కోవిడ్-19 తో బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు మరణించారు. కొన్నిరోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడిన అచ్యుతరావు మలక్పేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందిన ఆయన.. పరిస్థితి విషమించి బుధవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. అచ్యుతరావు సోదరుడు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే అదే ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన కోలుకొని ఈ రోజు డిశ్చార్జ్ అయినట్టు బంధువులు తెలిపారు.
తెలంగాణ, ఏపీ రాష్ట్ర బాలల హక్కుల కోసం అచ్యుత రావు..ఎన్నో పోరాటాలు చేశారు. బాలల హక్కుల సంఘం పేరుతో ఎన్జీవోను స్థాపించి చిన్నారుల కోసం ఎంతో పోరాడారు. హింసకు గురవుతున్న బాలలెందరినో ఆదుకున్నారు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. గతంలో ఆయన రాష్ట్ర బాలల హక్కుల సంఘం కమిషన్ సభ్యుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు. అచ్యుతరావు మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

