
న్యూఢిల్లీ, వెలుగు: ప్రముఖ రచయిత డా. గంగిశెట్టి శివకుమార్ రచించిన ‘కబుర్ల దేవత’స్టోరీ పుస్తకానికి ప్రతిష్టాత్మకమైన బాల సాహిత్య పురస్కారం వరించింది. అలాగే, ప్రసాద్ సూరి రచించిన ‘మై రావణ’నవల సాహిత్యానికి యువ పురస్కారం దక్కింది. బుధవారం (జూన్ 18) కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ నేతృత్వంలో సమావేశమైన అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు.. 2025 ఏడాదికి గాను బాల, యువ పురస్కారాలను ప్రకటించింది.
2019 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 మధ్య పబ్లిష్ అయిన పుస్తకాలను ఈ అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం 24 భాషల్లో అవార్డులను ప్రకటించగా.. ఈసారి డోగ్రి భాషకు సంబంధించి యువ పురస్కారాన్ని ప్రకటించలేదు. ఈ అవార్డులకు సంబంధించిన పుస్తకాల ఎంపికలో ఆయా భాషల్లో సాహిత్య రంగంలో ప్రముఖలుగా ఉన్న వ్యక్తులు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు.
తెలుగు భాషలో బాల పురస్కార్ ఎంపికకు కన్నెగంటి అనసూయ, ఎం.భూపాల్ రెడ్డి, కిలపర్తి దలినాయుడు జ్యూరీలుగా వ్యవహరించారు. కాగా, ఎంపికైన వారికి త్వరలో ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులను అందజేయనున్నారు. అవార్డు గ్రహితకు తామ్రపత్రంతో పాటు రూ.50 వేల నగదు అందజేయనున్నట్లు అకాడమీ ఒక ప్రకటలో పేర్కొంది.