తాలిబన్లతో దోస్తీకి రెడీ

తాలిబన్లతో దోస్తీకి రెడీ

బీజింగ్: అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. రాజధాని కాబూల్ ను వశం చేసుకున్న తాలిబన్లు.. ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. తాలిబన్ల పాలనను తలచుకుని అఫ్గాన్ ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ లో నెలకొన్న పరిస్థితులపై చైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాలిబన్లతో ఫ్రెండ్ షిప్ కు తాము రెడీనని డ్రాగన్ కంట్రీ ప్రకటించింది.

'అఫ్గానిస్థాన్ ప్రజలు తమకు కావలసిన దాన్ని స్వేచ్ఛగా ఎంచుకునే అవకాశం ఉంది. దీన్ని మేం గౌరవమిస్తాం. అభివృద్ధి దిశగా ముందడుగు వేసేందుకు అఫ్గాన్ కు కావాల్సిన సహాయ, సహకారాలను అందించడానికి మేం సిద్ధం. ఇందుకోసం మేం తాలిబన్లతో స్నేహపూర్వక సంబంధాలు కోరుకుంటున్నాం' అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్ యింగ్ స్పష్టం చేశారు.