బీజింగ్: క్రిప్టో/డిజిటల్ కరెన్సీల సెక్యూరిటీ, చెల్లుబాటు, చట్టపరమైన నియంత్రణలపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనుమానాలు ఉన్నా చైనా మాత్రం ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకుంది. ప్రపంచాన్ని శాసిస్తున్న డాలర్ను దెబ్బతీయడానికే ఈ ప్రయత్నమని తెలుస్తోంది. ఇక నుంచి స్టాక్స్ ఎక్సేంజీలలో సెటిల్మెంట్ల చెల్లింపులను యువాన్లలోనే జరపాలని నిర్ణయించింది. ఫలితంగా చైనీస్ ట్రేడింగ్లో డాలర్ ఉండదు. దీని విలువభారీగా పడిపోయి, యువాన్ బలపడే అవకాశాలు ఉంటాయి. నాలుగు మేజర్ సిటీల్లో వచ్చేవారం నుంచి తన సొంత డిజిటల్ కరెన్సీ వాడకానికి ట్రయల్స్ నిర్వహించనుంది. ఈ–ఆర్ఎంబీ పేరుతో డిజిటల్ కరెన్సీని తీసుకువస్తున్నట్టు చైనా సెంట్రల్ బ్యాంక్ గతంలోనే ప్రకటించింది. డ్రాగన్ డిజిటల్ కరెన్సీని తీసుకురావడం ఇదే తొలిసారి. అయితే బీజింగ్ సౌత్, షియాంగన్, షెంజెన్, సుజు, చెంగ్డు నగరాల్లో ఇది వరకే ట్రయల్స్ మొదలయ్యాయని లోకల్ మీడియా చెబుతోంది. 2022 వింటర్ ఒలింపిక్స్ జరిగే ప్రాంతాల్లోనూ ట్రయల్స్ వేస్తున్నారని తెలిపింది.
పబ్లిక్ ట్రాన్స్పోర్టులోనూ..
చాలా నగరాలు ఈ–ఆర్ఎంబీని అధికారిక కరెన్సీగా అంగీకరించాయని, మే నెల జీతాలను డిజిటల్ కరెన్సీలో చెల్లిస్తారని ప్రభుత్వ వార్తాపత్రిక చైనా డెయిలీ వెల్లడించింది. సుఝౌలో పబ్లిక్ ట్రాన్స్పోర్టులో చెల్లింపులకు కూడా ఈ–ఆర్ఎంబీనే వాడుతారని మరో మీడియా తెలిపింది. షియాంగన్లో మాత్రం ఆహారం, రిటైల్ పేమెంట్ల కోసం దీనిని ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. మెక్ డొనాల్డ్, స్టార్బక్స్ కూడా డిజిటల్ కరెన్సీని తీసుకురావడానికి అంగీకరించాయని సమాచారం. స్టార్బక్స్ మాత్రం ఈ విషయాన్ని తోసిపుచ్చింది. ట్రయల్స్తో తమకు సంబంధం లేదని తెలిపింది. చైనాలో డిజిటల్ పేమెంట్స్ను విపరీతంగా ఉపయోగిస్తారు. అలీ పే, వీచాట్ పే వంటి యాప్స్కు ఆదరణ ఎక్కువ. ఈ విషయమై పెకింగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు మాట్లాడుతూ ఆఫ్లైన్ పేమెంట్స్ వల్ల క్యాష్ఫ్లో గురించి కచ్చితమైన సమాచారం సెంట్రల్ బ్యాంకుకు అందడం లేదని చెప్పారు. అందుకే చైనా ప్రభుత్వం డిజిటల్ కరెన్సీని తెచ్చిందని చెప్పారు.