
- సరిహద్దు సమస్యలసై అజిత్ దోవల్తో చర్చలు
బీజింగ్: భారత్, చైనా సరిహద్దు సమస్యలపై చర్చలు జరిపేందుకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి సోమవారం (ఈ నెల 18) నుంచి రెండు రోజుల పాటు భారత్లో పర్యటిస్తారని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. ఈ సందర్భంగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో చర్చలు జరుపుతారని వెల్లడించింది. ఈ మేరకు వాంగ్ యి.. చైనా, -భారత సరిహద్దు సమస్యపై 24వ ప్రత్యేక ప్రతినిధుల (ఎస్ఆర్ల) సమావేశంలో పాల్గొంటారని తెలిపింది.
3,488 కి.మీ. పొడవైన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు వాంగ్ యి, అజిత్ దోవల్ తో కలిసి ప్రత్యేక ప్రతినిధుల సంభాషణ యంత్రాంగానికి నాయకత్వం వహిస్తారని పేర్కొంది. గత డిసెంబర్లో దోవల్ చైనాకు వెళ్లి.. వాంగ్ యీతో 23వ రౌండ్ చర్చలు జరిపారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రష్యాలోని కజాన్ నగరంలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ ఇరుపక్షాల మధ్య వివిధ సంభాషణ విధానాలను పునరుద్ధరించాలని నిర్ణయించిన కొన్ని వారాల తర్వాత దోవల్ గత డిసెంబర్లో చైనాకు వెళ్లి వాంగ్తో చర్చలు జరిపారు. వాంగ్ యి పర్యటన.. ఈ నెల 31–సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలోని టియాంజిన్ నగరంలో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు ముందు జరుగుతోంది. ఈ సదస్సుకు ప్రధానమంత్రి మోదీ హాజరయ్యే అవకాశం ఉంది.