- చైనాలోని యాప్స్ సర్వర్స్ నుంచి లింక్స్ షేర్ చేస్తున్న మహిళ జినా
- గుర్గావ్లో లోన్ రికవరీ నెట్వర్క్
- రోజుకు 50 మంది వద్ద రికవరీ టాస్క్
- ఒక్కో టాస్క్కు10 నుంచి 20శాతం కమీషన్
- దేశవ్యాప్తంగా 78 మందిని బ్లాక్మెయిల్ చేసిన గ్యాంగ్
- ఐదుగురు అరెస్ట్
హైదరాబాద్,వెలుగు: చైనా లోన్ యాప్స్ గ్యాంగ్ గుట్టురట్టైంది. హరియాణలోని గుర్గావ్ కేంద్రంగా చైనా మహిళ ఆపరేట్ చేస్తున్న లోన్ రికవరీ గ్యాంగ్ పోలీసులకు చిక్కింది.ఇన్స్టంట్ లోన్స్ తీసుకున్న వారి ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్న ఐదుగురిని రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రూ.1.5లక్షలు క్యాష్, 3 ల్యాప్టాప్లు,6సెల్ఫోన్స్,18 సిమ్ కార్డ్స్,డెబిట్ కార్డ్స్,రికార్డ్ రిజిస్టర్ సీజ్ చేశారు.చైనాకు చెందిన మహిళ జినా లోన్యాప్స్ ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించారు. యాప్స్ నెట్వర్క్ వివరాలను సైబర్క్రైమ్ డీసీపీ అనురాధతో కలిసి సీపీ చౌహాన్ బుధవారం వివరాలు వెల్లడించారు.
10,500 లోన్కు రూ.2.50 లక్షలు వసూలు
ఎల్బీనగర్కు చెందిన షేక్ అబ్దుల్ ‘హ్యాండీ లోన్ యాప్’లో రూ.10,500 ఇన్స్టంట్ లోన్ తీసుకున్నాడు.యాప్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో అన్ని పర్మిషన్స్ ఇచ్చాడు.దీంతో అబ్దుల్ ఫోన్ కాంటాక్ట్స్,గ్యాలరీలోని ఫోటోస్ను చైనా గ్యాంగ్ సేకరించింది.వివరాలను గుర్గావ్ గ్యాంగ్కి పంపించారు.బాధితుడు గడువులోగా డబ్బులు చెల్లించినా వేధించడం ప్రారంభించారు.మార్ఫింగ్ చేసిన ఫొటోస్ను వాట్సాప్లో షేర్ చేశారు.ఫోన్ కాంటాక్ట్లో ఉన్న నంబర్స్కి పంపిస్తామని బ్లాక్ మెయిల్ చేశారు.ఇలా రూ.2.50లక్షలు వసూలు చేశారు. ఈ డబ్బులో తమ కమీషన్ తీసుకుని అకౌంట్ హోల్డర్స్ నెట్వర్క్కు డిపాజిట్స్ చేసేవారు.అక్కడి నుంచి క్రిప్టో కరెన్సీ ద్వారా చైనాకు తరలిస్తున్నారు.
గుర్గావ్ గ్యాంగ్ అరెస్ట్తో..
బాధితుడి ఫిర్యాదుతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.గుర్గావ్లో రికవరీ గ్యాంగ్ను ట్రేస్ చేశారు.హరియాణ గుర్గావ్కు చెందిన అశుతోష్ మిశ్రా(22), లవ్మిట్ సయిని(19),ప్రశాంత్తన్వార్(22),ప్రిన్స్పాల్(22)వికాస్ శర్మ(22)ను అదుపులోకి విచారించారు.చైనా జినా నుంచి వచ్చిన లింక్స్ను గుర్తించారు.యాప్స్ వివరాలను సేకరించారు.చైనా సర్వర్స్ నుంచి లోన్ యాప్స్ ఆపరేట్ అవుతున్నట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా 78 మందిని బ్లాక్మెయిల్, వేధింపులకు గురి చేసి రూ.100కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఆధారాలు సేకరించారు. మాదాపూర్,రాచకొండ కమిషనరేట్లో 2 కేసులు నమోదైనట్లు గుర్తించారు.నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్(ఎన్సీఆర్పీ) డేటా ఆధారంగా దేశవ్యాప్తంగా 78 మందిని బ్లాక్మెయిల్ చేసి వేధింపులకు గురిచేసినట్లు ఆధారాలు సేకరించారు
రికవరీ నెట్వర్క్..
చైనాకు చెందిన జినా‘ హ్యాండీ లోన్ యాప్’తో పాటు మరో 38 లోన్ యాప్స్ డెవలప్ చేసింది.ఆన్లైన్ వర్క్ పేరుతో టెలిగ్రామ్లో లింక్స్ సర్క్యులేట్ చేసింది.సోషల్మీడియా ద్వారా నిరుద్యోగ యువతను ట్రాప్ చేసింది.లింక్స్ ఓపెన్ చేసి గ్రూప్లో జాయిన్ అయిన వారికి లోన్స్ రికవరీ చేయాలంటూ ఆఫర్ చేసింది.రికవరీ సొమ్ములో 10 నుంచి 20 శాతం కమీషన్ ఇస్తామని ఆశ చూపింది. ఇలా హరియాణ గుర్గావ్కు చెందిన అశుతోష్ మిశ్రా,లవ్మిట్ సయిని,ప్రశాంత్కుమార్ తన్వార్,ప్రిన్సిపాల్,వికాస్ శర్మలను కాంటాక్ట్లోకి తీసుకుంది.వీరికి యాప్స్ లింక్స్ పంపించింది.లోన్ రికవరీ చేయాలని టాస్క్ ఇచ్చింది.
చైనా సర్వర్లతో ఆపరేషన్..
చైనా సర్వర్స్ నుంచి లోన్ యాప్స్ను జినా ఆపరేట్ చేసింది.రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు లోన్స్ ఇచ్చేలా యాప్ లింక్స్ సర్క్యులేట్ చేసింది.అవసరాల కోసం లోన్స్ తీసుకున్న వారి ఫోన్ కాంటాక్ట్స్,గ్యాలరీలోని ఫొటోస్,ఇతర వ్యక్తిగత వివరాలను సేకరించేవారు.యాప్స్ కండీషన్స్ను ఫాలో అయిన వారికి మాత్రమే లోన్ అమౌంట్ డిపాజిట్ చేసేవారు.7 రోజులు గడువు విధించేవారు.గడువు లోగా చెల్లించని వారికి 15 నుంచి 20 శాతం వడ్డీ వసూలు చేసేవారు.లోన్ అమౌంట్ పూర్తిగా చెల్లించిన వారికి అడుగకపోయినా అకౌంట్స్లో మళ్లీ డబ్బు డిపాజిట్ చేసేవారు.
రోజు 50 మందికి టాస్క్
లోన్ అమౌంట్ను రికవరీ చేసేందుకు యూజర్ ఐడీ, పాస్వర్డ్స్ను గుర్గావ్లోని గ్రూప్కి జినా షేర్ చేసేది.దేశవ్యాప్తంగా లోన్స్ తీసుకున్న వారి ఫోన్ నంబర్స్,కాంటాక్ట్స్ లిస్ట్,ఫోన్స్ గ్యాలరీలోని ఫొటోస్ను అందించేది.ఇలా ప్రతి రోజు ఒక్కొక్కరికి 50 మందిని టార్గెట్గా ఫిక్స్ చేసింది.రికవరీ చేసిన లోన్ అమౌంట్లో 10 నుంచి 20 శాతం కమీషన్ వారి అకౌంట్స్కి డిపాజిట్ చేసేలా యాప్స్ క్రియేట్ చేశారు.దీంతో గుర్గావ్ రికవరీ గ్యాంగ్ కస్టమర్స్కి కాల్స్ చేస్తుండేది.జినా నుంచి సేకరించిన ఫొటోస్ను మార్ఫింగ్ చేసి లోన్ తీసుకున్న వారి వాట్సాప్కి పంపిస్తున్నారు.కాంటాక్ట్ లిస్ట్లోని నంబర్స్కి కాల్స్ చేసి దుర్భాషలాడుతున్నారు.