
- తాజా కూరగాయలు అందుతున్నాయా అంటూ ఆరా
- సరిహద్దులను కాపాడుతున్న హీరోలంటూ పొగడ్తలు
- 24 గంటలూ గస్తీ కాస్తున్నామని ప్రెసిడెంట్ కు చెప్పిన సోల్జర్లు
బీజింగ్: ‘ఇటీవలి కాలంలో బార్డర్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని తెలుస్తోంది.. ఇప్పుడు అక్కడ ఎలా ఉంది? ఒకవేళ ఇప్పటికిప్పుడు యుద్ధం చేయాల్సి వస్తే మీరు సిద్ధమేనా?’ అంటూ చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులను ఆరాతీశారు. బార్డర్లో గస్తీ కాస్తున్న సైనికులతో జిన్ పింగ్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సైనికుల యుద్ధ సన్నద్ధతను, వారికి అందుతున్న రేషన్ తదితర వివరాలను ఆరా తీశారంటూ చైనా అధికార మీడియా శుక్రవారం వెల్లడించింది. అయితే, జిన్ పింగ్ వీడియో కాల్ వెనకున్న ఉద్దేశంపై నిపుణులలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బార్డర్ లో ఉన్న సైనికులు యుద్ధానికి రెడీగా ఉన్నారో లేదో విచారించడం ద్వారా పొరుగున ఉన్న దేశాలకు పరోక్షంగా హెచ్చరిక చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదీ తూర్పు లడాఖ్ వెంబడి ఉన్న ఇండియా సరిహద్దుల్లో డ్యూటీ చేస్తున్న సైనికులతో జిన్ పింగ్ మాట్లాడడంతో ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రేషన్ సరిగ్గా అందుతోందా..
సరిహద్దులలోని వాతావరణం కారణంగా నిత్యావసరాల రవాణా చాలా కష్టమవుతుందని చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ పేర్కొన్నారు. ఇప్పుడు మీకు తాజా కూరగాయలు అందుతున్నాయా లేదా అని సైనికుల వద్ద ఆరా తీశారు. ఈమేరకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ హెడ్డాఫీసుకు చేరుకున్న జిన్ పింగ్.. అక్కడి నుంచే వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద విధినిర్వహణలో ఉన్న సైనికులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. డ్యూటీలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిన్ పింగ్ వారికి సూచించారు. ఎల్ఏసీ వెంబడి ఉన్న ఖుంజెరాబ్ ఏరియాలో పరిస్థితిని సైనికులను అడిగి తెలుసుకున్నారు. బార్డర్ను కాపాడడంలో నిజమైన హీరోలు మీరేనంటూ సైనికులపై పొగడ్తలు కురిపించారు. కాగా, ప్రెసిడెంట్ ప్రశ్నకు ఓ సైనికుడు జవాబిస్తూ.. బార్డర్ వెంట 24 గంటలూ గస్తీ కాస్తున్నట్లు చెప్పాడు.
ఇండియన్ సోల్జర్లతో గొడవపడింది ఇక్కడే..
2020 మే 5న లడాఖ్ బార్డర్లో ఇండియా–చైనా సైనికుల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే! పాంగాంగ్ సరస్సు ఒడ్డున జరిగిన ఈ గొడవలో చైనా సైనికులు పెద్ద సంఖ్యలో మరణించారని వార్తలు వెలువడ్డాయి. అయితే, జిన్ పింగ్ ప్రభుత్వం మాత్రం తమవైపు ప్రాణనష్టం తక్కువేనని ప్రకటించింది. ఈ గొడవ తర్వాత రెండు దేశాల మధ్య 17 దఫాలుగా ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఈ ఏరియాలో టెన్షన్లు పూర్తిగా చల్లారలేదు. తాజాగా ఇక్కడ విధుల్లో ఉన్న సైనికులతోనే చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది.