- హర్యానాలో హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము-కశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు 34 శాతం తగ్గిపోయాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. అలాగే భద్రాతా దళాల మరణాలు 64 శాతం, పౌరుల మరణాలు 90శాతం తగ్గాయని వెల్లడించారు. హర్యానాలోని సూరజ్ కుంద్ లో అన్ని రాష్ట్రాల హోంమంత్రులతో రెండ్రోజులపాటు జరిగే చింతన్ శివిర్ ను అమిత్ షా ప్రారంభించారు. ఈ సమావేశాల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల హోం మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. వివిధ అంశాలపై ఆరు సెషన్లలో చర్చలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా కీలక ఉపన్యాసం చేసిన హోం మంత్రి అమిత్ షా.. ఆర్టికల్ 370 రద్దు ప్రభావం.. ఫలితాలను వివరించారు. ఇప్పుడు నిర్వహిస్తున్న చింతన్ శివిర్ సమావేశాలు దేశంలో సైబర్ క్రైమ్, నార్కొటిక్స్, క్రాస్ బోర్డర్ టెర్రరిజం లాంటి నేరాల నియంత్రణకు ఉపయోగపడుతాయని తెలిపారు. ప్రతి రాష్ట్రంలో ఎన్ఐఏ శాఖలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. 2024లోగా అన్ని రాష్ట్రాల్లో ఎన్ఐఏ బ్రాంచ్ ల ఏర్పాటు పూర్తి చేస్తామని అమిత్ షా వివరించారు.